Breaking News

పేదల జీవితాలు బంగారు మయం కావాలి

-ధనిక-పేద మధ్య అసమానతలు పోవాలి
-పేదలను ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తోన్న మార్గదర్శులు
-బంగారు కుటుంబాలు, మార్గదర్శుల సమావేశలో ముఖ్యమంత్రి చంద్రబాబు

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
పేదరిక నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారంగా పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ ప్రాస్పెరిటీ) కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదల జీవితాలు బంగారు మయం కావాలనే ఉద్దేశ్యంతోనే పీ4 ద్వారా బంగారు కుటుంబాలు-మార్గదర్శుల విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆదివారం పీ4 మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బంగారు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మెగా, అదానీ, టీవీఎస్ మోటార్ సైకిల్స్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. బంగారు కుటుంబాలు కేవలం ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్థితిలో కాకుండా, ఆర్థికంగా ఎదిగి ఇతరులకు సైతం చేయూతనిచ్చే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇందుకోసం బంగారు మిత్రల సహకారంతో ప్రతి కుటుంబం స్థితిగతులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పీ4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని చంద్రబాబు తెలిపారు. దీనిని ఎంబీకే–10:20 నమూనాగా అమలు చేస్తున్నామని, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్న 20 శాతం కుటుంబాలకు అండగా నిలవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు.

సమాజంపై నమ్మకాన్ని పెంపొందిస్తోన్న మార్గదర్శులు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వీరికి అండగా నిలిచేందుకు ఇప్పటివరకు 1.10 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావడం పీ4 కార్యక్రమంపై సమాజంలో ఏర్పడిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. డబ్బులు ఇచ్చి వెళ్లిపోవడం మాత్రమే ఈ కార్యక్రమం ఉద్దేశం కాదని, కుటుంబాల జీవన ప్రమాణాలను శాశ్వతంగా మెరుగుపరిచేలా మార్గనిర్దేశం చేయడమే అసలు లక్ష్యమని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో 9 వేల బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసే బాధ్యతను అదానీ, టీవీఎస్, మెగా సంస్థలకు అప్పగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కుటుంబాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వారి జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడానికి సంస్థలు, మార్గదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పీ4 కార్యక్రమం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకున్న బంగారు కుటుంబాల విజయగాథలను రాష్ట్ర ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇలాంటి విజయాలు మరెంతో మందికి స్ఫూర్తినిస్తాయని చెప్పారు. అలాగే తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ముందుకొచ్చిన మార్గదర్శుల పట్ల బంగారు కుటుంబాలు కృతజ్ఞతాభావంతో ఉండాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరాలంటే ఆదాయాలు పెరగాలని, ఆర్థిక అసమానతలు తగ్గి ప్రతి కుటుంబం మెరుగైన జీవన ప్రమాణాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో పీ4 కార్యక్రమాన్ని దేశానికే ఆదర్శంగా నిలిచే నమూనాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, కుప్పం స్థానిక నేతలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *