విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎంఎల్ఏ సుజన చౌదరి ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కు విశేష స్పందన లభిస్తోంది. ఎం ఎల్ ఏ ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు, కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు.
ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం, రేషన్ కార్డులు, గురించి ప్రజలు భారీగా వినతులు అందజేశారు. చాలా వరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు, మిగిలిన వాటిని సంబంధిత శాఖల ద్వారా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా అన్నారు. కూటమి నేతలు మహ్మద్ జాహిద్ ,పల్లంటి ఆది, బొల్లేపల్లి కోటేశ్వరరావు.. తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News