గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలు ఎవరికైనా అందకుంటే వార్డ్ లలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లు, సమీప సచివాలయాలు లేదా ఇంటింటికి వచ్చే బిఎల్ఓలకు అందించాలని, బిఎల్ఏలు కూడా సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం గుంటూరు నగరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు షుమారు 99 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారని, ఇంకా ఎవరికైనా అందకుంటే బిఎల్ఓల దృష్టికి తీసుకురావాలని కోరారు. సర్ పై అనుమానాల నివృత్తి, అవగాహన, ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకోవడానికి వార్డ్ ల వారీగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే శనివారం, ఆదివారాల్లో సెలవు రోజులైనప్పటికీ, సచివాలయాలలో, హెల్ప్ డెస్క్ లలో సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. సర్ ప్రక్రియ ముగింపుకు 4 రోజులే గడువు ఉన్నందున, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఓటర్లకు ఫారాలను నింపి ఇచ్చేందుకు సహకరించాలన్నారు. చివరి సమయంలో సర్వర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుందని, ముందుగానే ఫారాలు ఇవ్వాలన్నారు. అలాగే 1950 కి కాల్ చేసి బుక్ ఏ కాల్ బిఎల్ఓ ని కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ జి.సాంబశివరావు, డిప్యూటీ తహశీల్దార్లు నాగమల్లేశ్వరావు, సుధా కిరణ్మై, సతీష్, శ్రీనివాస్, (టిడిపి) నారాయణ రెడ్డి, కుమార్ (బిజేపి) మహేష్ రెడ్డి, శ్రీనివాస్ రావు(వైస్సార్సీపీ), డాక్టర్ సేవా కుమార్ (ఆమ్), వాసు (బియస్పి), నళినీ కాంత్ (సిపిఎం), త్రినాద్ (జనసేన) తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News