– సహకారాన్ని కొనసాగిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
– సర్పై రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలోని కీలకదశ అయిన ఇంటింటి సర్వే సాఫీగా సాగుతోందని.. ఇప్పటివరకు 75 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ప్రక్రియలో కీలక సహకారం అందిస్తున్న రాజీకీయ పక్షాలు మరింత సహకారంతో కార్యక్రమం విజయవంతానికి చేయూతనివ్వాలని కోరారు.
శుక్రవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ ప్రస్తుతం జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతున్న తీరును వివరించారు. వివిధ అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. జిల్లాలో 13,34,504 (77.88 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. తిరువూరు నియోజకవర్గంలో 1,80,018 (86.25 శాతం), విజయవాడ పశ్చిమలో 1,83,788 (71.52 శాతం), విజయవాడ సెంట్రల్లో 2,02,494 (72.89 శాతం), విజయవాడ తూర్పులో 2,00,092 (74.18 శాతం), మైలవరంలో 2,31,191 (81.07 శాతం), నందిగామలో 1,68,716 (81.32 శాతం), జగ్గయ్యపేటలో 1,68,205 (81.04 శాతం) ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని వివరించారు. నియోజకవర్గాల్లో బీఎల్వోలతో పాటు హెల్ప్ డెస్కులు అందుబాటులో ఉన్నాయని, ఓటరు హెల్ప్లైన్ (1950) కూడా అందుబాటులో ఉందన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోలు విశేష కృషి చేస్తున్నారని.. వీరికి అధికారులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఫారాలు సమర్పించే విషయంలో బీఎల్ఏలు కూడా ఓటర్లను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు వై.రామయ్య, కె.రాజేష్ (తెదేపా), తరుణ్ కాకాని (భాజపా), జె.శ్రీనివాస్ (జేఎస్పీ), డీవీ కృష్ణ (సీపీఐ-ఎం), వై.ఆంజనేయరెడ్డి (వైఎస్ఆర్సీపీ), పవన్ కార్తీక్ (బీఎస్పీ), పి.హరికృష్ణ (ఆప్) పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News