గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఎన్యూమరేషన్ ఫారాలను అత్యధిక ప్రాధాన్యతతో డిజిటైజ్డ్ చేయాలని, సూపర్వైజరీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం నగరంపాలెం, ఆర్.అగ్రహారం, ఎన్ఎస్పీ కెనాల్ క్వార్టర్స్ లోని వార్డ్ సచివాలయాల్లో బిఎల్ఓలు చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజ్డ్ ప్రక్రియను పరిశీలించి, వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాలను అత్యంత ప్రాధాన్యతతో, త్వరితగతిన డిజిటలైజ్డ్ చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎన్యూమరేషన్ అత్యంత కీలకమైనదని, ఇందులో ఎలాంటి ఆలస్యం జరగకుండా వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బీఎల్ఓలు చేస్తున్న ఈ ఆన్లైన్ నమోదు ప్రక్రియపై సూపర్వైజరీ అధికారులు నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. బిఎల్ఓలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పరిధిలోని విఐపీలు, మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధుల ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజ్డ్ చేయడం, మ్యాపింగ్ చేసి, కార్డ్ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఓటరు జాబితాలో తప్పులకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పని పూర్తి చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుంటూరు నగర పరిధిలోని ఓటర్లు కూడా తమ ఓటుకి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు అందకుంటే స్థానిక సచివాలయం లేదా బిఎల్ఓని సంప్రదించాలని సూచించారు.
Prajavartha Online Telugu News