గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణానదిలోకి గోదావరి నీరు వస్తున్నందున నీటిలో టర్బిటి శాతం అధికంగా ఉండే అవకాశం ఉంటుందని, త్రాగునీటి సరఫరా సమయంలో క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ శ్యాంపిల్స్ తీయాలని, నగర ప్రజలు కూడా కొంత కాలం త్రాగునీటిని కాచి చల్లార్చి త్రాగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరానికి ప్రధాన త్రాగునీటి వనరైన ప్రకాశం బ్యారేజిలోకి పట్టిసీమ నుండి గోదావరి నీరు వస్తున్నందున, సదరు నీటిలో సాదారణం కంటే టర్బిటి శాతం అధికంగా ఉంటుందన్నారు. నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ లో నీటి శుద్ధిపై ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించామన్నారు. నిర్దేశిత ప్రమాణంలో ఆలం కలిపేలా, సరఫరా సమయంలో క్లోరిన్ తగు మోతాదులో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నగరంలోని అన్ని రిజర్వాయర్లను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం క్లీన్ చేసి, తేదీలను బోర్డ్ లపై రాస్తున్నామన్నారు. ఇప్పటికే గుర్తించిన 1437 డ్రైన్ క్రాసింగ్ పైప్ లైన్లను వాటిని షిఫ్ట్ చేశామని తెలిపారు. ఫిల్టర్ బెడ్స్ ని కూడా ఎప్పటికప్పుడు క్లీని చేయాలన్నారు. సచివాలయాల ఎమినిటీ కార్యదర్శులు, వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రజల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రతి రోజూ సరఫరా అయ్యే త్రాగునీటి నాణ్యతను క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి సచివాలయ పరిధిలో 10 కి తగ్గకుండా నీటి నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఎమినిటీ కార్యదర్శులు, వర్క్ ఇన్స్పెక్టర్లు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధానంగా టెయిల్ ఎండ్ పాయింట్లతో పాటు, నేరుగా ప్రజల ఇళ్లకు చేరే కనెక్షన్ల వద్ద కూడా తప్పనిసరిగా నీటి నమూనాలను సేకరించి పరీక్షలు చేయాలన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా జరిగే నీటి పరీక్షలను ఏఈలు నిరంతరం పర్యవేక్షిస్తూ, పరీక్షల ఫలితాలను ఏపీసిఎంఎంఎస్ యాప్ లో క్రమం తప్పకుండా నమోదు చేయాలని, త్రాగునీటి పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఎక్కడైనా కలుషిత నీరు సరఫరా అయినట్లు ఫిర్యాదులు వచ్చినా, డయేరియా అనుమానిత కేసులు నమోదు గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న కీలకమైన త్రాగునీటి సరఫరా అంశంలో ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిరంతర పర్యవేక్షణ ద్వారా నగరంలో కలుషిత నీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉండే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News