-ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బోధనాసుపత్రుల్లో చిన్న చిన్న మరమ్మతు పనులు చేపట్టేందుకు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.51 కోట్ల వరకు ప్రభుత్వం వ్యయం చేయబోతుంది. 13 సర్వజన ఆసుపత్రులు (జీజీహెచ్ లు), 13 మెడికల్, డెంటల్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతు పనుల కోసం మొత్తమ్మీద రూ.34.07 కోట్లు, రూ.16.92 కోట్లు చొప్పున అవసరమవుతాయని సదరు సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల ప్రకారం డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై ఆర్థిక శాఖతో అధికారులు చర్చించారు. దీంతో సదరు బోధనాసుపత్రుల డెవలప్ మెంట్ ఫండ్స్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యా సేవ ట్రస్టు నిధుల నుంచి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేబట్టేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా డీఎంఈ డాక్టర్ ఎ. విష్ణువరన్ ఉత్తర్వులిచ్చారు.
కేజీహెచ్ లో రూ.8.77 కోట్లు, శ్రీకాకుళం జీజీహెచ్ లో రూ.5.29 కోట్లతో…
అత్యధికంగా కేజీహెచ్ లో రూ.8.77 కోట్లతో, శ్రీకాకుళం జీజీహెచ్ లో రూ. 5.20 కోట్లతో, కాకినాడ జీజీహెచ్ లో రూ.2.94 కోట్లు, విజయవాడ జీజీహెచ్ రూ.4.10 కోట్లతో సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జీజీహెచ్ లో సూపర్ స్పెషాల్టీ, మెడికల్ వార్డుల అవసరాలకు తగ్గట్లు మెడికల్ గ్యాస్ పైపులైను, క్యాంటీన్ బిల్డింగ్ దగ్గర ఆర్సీసీ ర్యాంప్, వాటర్, మురుగు నీరు పైపుల మరమ్మతులు చేపట్టనున్నారు. కేజీహెచ్ లో రూఫ్ లీకేజీ మరమ్మతులు, కాకినాడ జీజీహెచ్ సర్జికల్ వార్డు మరుగుదొడ్లకు మరమ్మతులు చేయనున్నారు. అలాగే శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ. 1.35 కోట్లతో అత్యవసరంగా అవసరమైనచోట్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. నీటి పంపిణీకి సంబంధించిన పైపులైన్లను మరమ్మతు చేయనున్నారు. విద్యుత్తు సరఫరా మెరుగుకోసం అవసరమైన మరమ్మతు పనులను చేబట్టనున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో అభివృద్ధి పనుల కోసం రూ. 1.11 కోట్లు, విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలలో రూ.1.28 కోట్లు, కాకినాడ వైద్య కళాశాలలో రూ.3.68 కోట్లు చొప్పున వ్యయం చేయనున్నారు.
Prajavartha Online Telugu News