-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు IAS
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా వ్యవస్థ పరిపాలనను బలోపేతం చేయడంలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు (DDOలు), పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఐఏఎస్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలో జోన్-2 డిడిఓల కోసం ఏర్పాటు చేసిన “SNA-స్పర్శ్” (SNA-SPARSH) ఒకరోజు అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీడీ బి. శ్రీనివాసరావు దిశానిర్దేశం చేస్తూ.. విద్యా రంగంలో సమగ్ర శిక్ష, పీఎంశ్రీ (PM SHRI) కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలను (Learning Outcomes) గణనీయంగా మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా SNA-స్పర్శ్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను నిర్ణీత సమయంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. డిడిఓలు తమ జాబ్ చార్ట్లోని బాధ్యతలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, ఆర్థిక నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, సరైన వ్యయం, నిబద్ధతతో కూడిన పనితీరు ద్వారానే రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్ర విద్యా రంగ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి స్టేట్ ఫైనాన్స్ కంట్రోలర్ బి.రాజగోపాలరావు, కాకినాడ ఆర్జేడీ జి.నాగమణి, జోన్-2 పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ, డా. బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పోలవరం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల డీఈవోలు, సమగ్ర శిక్ష ఏపీసీలు, డిడిఓలు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News