-భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ విజయానికి పార్టీ శ్రేణుల సమన్వయంపై కళా, దేవినేని సమీక్ష
-రెండేళ్ల కూటమి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
గరివిడి, నేటి పత్రిక ప్రజావార్త :
భోగాపురంలో ఆగస్టు 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక విజయంగా నిలపాలని టిడిపి నేతలు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలం శేరిపేట గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో మాజీ మంత్రి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావుతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జ్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గరివిడి మండలం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ప్రారంభోత్సవానికి హాజరయ్యేలా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ప్రజల రవాణా, వాహనాల పార్కింగ్, భోజన సదుపాయాలు, మండలాల వారీ సమన్వయం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.
ప్రతి కార్యకర్త ఒక సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించి, ప్రతి గ్రామం నుంచి ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటక రంగ విస్తరణ, ఉపాధి అవకాశాల పెరుగుదలకు కొత్త ఊపు లభిస్తుందని తెలిపారు.
రెండేళ్ల కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఘనవిజయం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News