గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఆగస్టు 15వ తేదీ నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్, 120 మైక్రాన్ కంటే తక్కువ కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల వినియోగాన్ని పూర్తిగా నిషేదం అమలులో ఉంటుందని, దుకాణాలు, హోటళ్లు, మార్కెట్లు, వాణిజ్య సంస్థలు, వ్యాపార సంఘాల ప్రతినిధులు సహకరించాలని నగరపాలక సంస్థ సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ కోరారు. నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక శ్రీవెంకటేశ్వరవిజ్ఞాన మందిరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుపై అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సిఎంఓహెచ్ మాట్లాడుతూ ఆగస్టు 15 నుండి గుంటూరు నగర పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, 120 మైక్రాన్ కంటే తక్కువ కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల వినియోగం పై పూర్తిగా నిషేదం విధించినందున, నగర పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, నిల్వ, విక్రయం, పంపిణీ మరియు వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై స్వచ్చ గుంటూరు యాప్ ద్వారా సంబంధిత చట్టాల ప్రకారం జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. వ్యాపారులు, హోటల్ యజమానులు, మార్కెట్ అసోసియేషన్లు, వాణిజ్య సంస్థలు, ప్రజలు ప్లాస్టిక్ రహిత గుంటూరు నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందాజేయడం ద్వారా ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
తొలుత వాష్ ఇన్స్టిట్యూట్ టెక్నికల్ ఎక్స్పర్ట్ సోమ రఘు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల జాబితా, ప్రత్యామ్నాయంగా వినియోగించాల్సిన పర్యావరణ హిత ఉత్పత్తులు, వ్యాపారులు పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఎస్ఎస్ లు, ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, స్వయం సహాయక సభ్యులు, వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News