-జల్ వాహన్ పథకం పై పార్లమెంట్ వేదిక గా ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్న
-ఎంపీ చిన్ని ప్రశ్నకు కేంద్ర మంత్రి సర్భానంద సోనోవాల్ సమాధానం
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో అంతర్గత జల రవాణా ను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలవాహక్ పథకం పురోగతిపై విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్సభలో ప్రశ్నించగా, కేంద్ర ఓడరేవులు, నౌకాయానం మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ సమగ్ర వివరాలను వెల్లడించారు.
ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, ప్రస్తుతం జలవాహక్ పథకం కింద 12 మంది కార్గో యజమానులు నమోదు చేసుకోగా, వారిలో 7 మందికి ఆమోదం లభించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి కార్గో యజమాని ప్రోత్సాహకానికి సంబంధించిన క్లెయిమ్ సమర్పించకపోవడంతో, ఇప్పటివరకు ఎలాంటి ప్రోత్సాహకాలు విడుదల కాలేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం జాతీయ జలమార్గం–1 (వారణాసి–కోల్కతా) మరియు జాతీయ జలమార్గం–2 (కోల్కతా–పాండు, గౌహతి) మార్గాల్లో షెడ్యూల్డ్ సేవలు నిర్వహిస్తున్నట్లు, వాటి కోసం 8 అంతర్గత జల రవాణా (IWT) నౌకలు సేవలందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ సేవల సామర్థ్య వినియోగం కూడా ఆశాజనకంగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. కోల్కతా–వారణాసి మార్గంలో నౌకల సగటు సామర్థ్య వినియోగం 79.34 శాతం, కోల్కతా–పాండు మార్గంలో 71.05 శాతంగా నమోదైంది. ఒక్కో ప్రయాణానికి సగటు వ్యయం వరుసగా రూ.21.44 లక్షలు మరియు రూ.33.32 లక్షలుగా ఉందని వివరించింది.
జలవాహక్ పథకం అమలుపై టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బిర్లా వైట్ సిమెంట్ తదితర కార్గో సంస్థలు సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. షెడ్యూల్డ్ సేవల వల్ల అంతర్గత జల రవాణాపై విశ్వాసం పెరిగి, సరుకు రవాణా మరింత సులభతరమైందని ఆయా సంస్థలు తెలిపినట్లు తెలిపారు
అలాగే, 2025–26 సంవత్సరంలో జాతీయ జలమార్గాలు–1 మరియు 2పై నిర్వహించిన షెడ్యూల్డ్ సేవలు వార్షిక లక్ష్యంతో పోలిస్తే 104.7 శాతం సరుకు రవాణా వృద్ధిని నమోదు చేయడం విశేషమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో తక్కువ వ్యయంతో, పర్యావరణ హితంగా సరుకు రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని అన్నారు. అంతర్గత జలమార్గాల అభివృద్ధి ద్వారా లాజిస్టిక్స్ వ్యయం తగ్గడంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు మరింత ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోని జలమార్గాల అభివృద్ధి, సరుకు రవాణా అవకాశాల విస్తరణకు కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు
Prajavartha Online Telugu News