– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మరమ్మతులు తదితరాలపై గత నాలుగు ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టాక నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారయింది. రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొత్తగా ఒక ఎకరా ఆయకట్టుకు కూడా నీరు అందించిన దాఖలాలు లేవు. గండికోటలో నీళ్లు ఉన్నప్పటికీ కాలువలు తవ్వలేదు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీరు ఇచ్చే స్థితి లేదు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టుల పరిస్థితి అతిగతి లేదు. పోలవరం నిర్మాణం, నిర్వాసితుల సమస్యల పరిష్కారం ప్రశ్నార్ధకమయింది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు, డ్యాములకు మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలోగాని, నీటిపారుదల శాఖలోగాని ఏమాత్రం స్పందన లేదు. గత ఏడాది వరదల కారణంగా కొట్టుకుపోయిన అన్నమయ్య, ఫించా ప్రాజెక్టుల పునర్నిర్మాణ ఊసే లేదు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం గాలికొదిలేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. పోలవరం నిర్మాణ అంశంలో జగన్మోహన్ రెడ్డి రివర్స్ వైఖరి అవలంబిస్తున్నారు. కేంద్రం నుండి పోలవరానికి నిధులు రాబట్టడంలో జగన్ సర్కార్ విఫలమైంది. పోలవరానికి నిధులు ఇవ్వకుండా, ఎత్తు కూడా తగ్గించే కుట్రతో కేంద్ర ప్రభుత్వం నిర్వాసితులకు అన్యాయం చేయాలని చూస్తోంది. కేంద్రం చేస్తున్న కుట్రపూరిత యత్నాలను తిప్పి కొట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతులు, మరమ్మత్తులు, ఖర్చు వివరాలు, అంచనా వ్యయం తదితరాల గురించిన సమగ్ర సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు.
Prajavartha Online Telugu News