అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి చేయడం జరిగిందని సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం అనపర్తి నియోజక వర్గ పరిధిలో ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్లు, ఇతర ఆరోగ్య, అనుబంధ శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి. యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, పి హెచ్ సి , సి హెచ్ సి పరిధిలో వచ్చే గర్భిణీలకి చెందిన అన్ని కేసులను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయాలని ఆదేశించారు. ఆమేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంచామన్నారు. మాతృ మరణాలు సంభవించకుండా ప్రభుత్వం వైద్య సిబ్బంది తీసుకోవలసిన జాగ్రత్తల పై మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.
గర్భిణీ స్త్రీలు రవాణా కోసం 108, 104 మరియు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. రక్త హీనత అధిగమించేందుకు అవసరమైన మందులు ఇవ్వాలని కోరారు. అన్ని ఆసుపత్రుల్లో ఉచిత రక్త మార్పిడి సౌకర్యాలు అందుబాటులో ఉంచామని, ఒక నెల తర్వాత పనితీరు మళ్లీ సమీక్షిస్తానని తెలిపారు. డి సి హెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి, డిప్యూటీ డి ఏం హెచ్ వో, ఏరియా ఆసుపత్రి అనపర్తి, సామాజిక ఆరోగ్య కేంద్రం, కడియం ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News