అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఎబిడిఎం తో లింక్ చేయడంవల్ల రోగులకు ఎంతగానో మేలు జరుగుతుందని డిఎంఇ (ఎకడమిక్) డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. రోగులు తమ టెస్ట్ రిపోర్టులు , ప్రిస్క్రిప్షన్ పేపర్లు ప్రతిసారీ తీసుకెళ్లనవసరం లేకుండా ఇహెచ్ ఆర్ ఉపకరిస్తుందన్నారు. ఇహెచ్ ఆర్ లను రూపొందించడం ద్వారా ఆసుపత్రులకు కూడా పారితోషికం లభిస్తుందన్నారు. దీనిని ప్రభుత్వాసుపత్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలోని జిజిహెచ్ లు , టీచింగ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు , ల్యాబ్ టెక్నీషియన్లకు డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్లుగా రెండో బ్యాచ్ రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని హాయ్ ల్యాండ్ లో ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎబిడిఎం బుక్ లెట్లను ఆవిష్కరించారు. రెండో బ్యాచ్ లో దాదాపు వంద మంది మాస్టర్ ట్రైనింగ్ కు హాజరయ్యారు. జిల్లాల మాస్టర్ ట్రైనీలనుద్దేశించి డిఎంఇ(ఎకడమిక్)డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 4.13 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అక్కౌంట్లు(Ayushman bharat health accounts-,ABHAs) క్రియేట్ చేయడం అభినందనీయమన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో ఏపీ గణనీయమైన విజయాన్ని సాధించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య సంస్థలలో ఆరోగ్య రికార్డుల్ని డిజిటలైజ్ చేయడంలో రాష్ట్ర బృందం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. హెల్త్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల(EHR) ఉపయోగాన్ని ప్రజలకు తెలియజెప్పాలని , అవగాహన కల్పించాలని సూచించారు. ఇక్కడ శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు తమతమ జిల్లాల్లో సమర్ధవంతంగా శిక్షణ ఇవ్వాలన్నారు. ఎబిడిఎంను విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రైనర్లు కీలకపాత్ర పోషించాలన్నారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ayushman bharat digital mission-ABDM) రాష్ట్ర నోడల్ అధికారి బొడ్డేపల్లి వెంకటేశ్వరరావు, నేషనల్ హెల్త్ మిషన్ ఎస్పీఎం డాక్టర్ దుంపల వెంకట రవికిరణ్ , ఎబిడిఎం నోడల్ ఆఫీసర్(డిఎంఇ) ప్రేమ్ నిస్సీ , ఎబిడిఎం పీఓ డాక్టర్ నరేష్, ఎన్ఐసి ట్యూటర్లు, ఏబీడీఎం ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
