– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తికావడంతో జిల్లా ఎన్నికల అధికారి మార్గనిర్దేశనంతో అధికారులు ఎన్నికల సామగ్రిని భద్రపరిచే కార్యకలాపాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం కలెక్టరేట్లోని ప్రత్యేక గోదాములో ఎన్నికల్లో ఉపయోగించిన స్టాట్యుటరీ కవర్స్, ఫారాలు, రిజిస్టర్లు వంటి ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచే కార్యక్రమాన్ని కలెక్టర్ డిల్లీరావు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినందున ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల సామగ్రి, ఎన్నికల ఇతర సామగ్రిని సురక్షితంగా భద్రపరచడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎం, వీవీప్యాట్లను పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా మార్గదర్శకాల మేరకు గొల్లపూడిలోని ప్రత్యేక గోదాములో భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఇతర సామగ్రిని కూడా సురక్షితంగా భద్రపరుస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వెల్లడించారు.