-వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక పరిశుభ్రత చాలా ముఖ్యం
-ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య ఆంధ్ర సాకారానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక పరిశుభ్రతపై దృష్టిసారించాలని.. సమస్టి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ శనివారం విజయవాడ రూరల్ గూడవల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే సమాజం అంతా పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. మనతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్య మహాభాగ్యాన్ని పొందవచ్చు అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుంచి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా తడి చెత్త -పొడి చెత్తను వేరుచేసి సామాజిక బాధ్యతగా ముందడుగు వేస్తున్న మహిళలకు జాయింట్ కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. అదే విధంగా గ్రీన్ అంబాసిడర్లను సత్కరించారు. అంగన్వాడి, వైద్య ఆరోగ్యం, స్వయం సహాయక సంఘాల స్టాళ్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీపీవో పి.లావణ్య కుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, పంచాయతీరాజ్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News