తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తైన సందర్భంగా, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని తిరుపతిలోని అలిపిరి శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి టెంకాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించి, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని యథావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని మొక్కులు మొక్కారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి రెండు భుజాల్లోనూ రోటేటర్ కఫ్ దెబ్బతినడంతో పాటు కుడి భుజంలో స్వల్ప ఎముక విరుగు (ఫ్రాక్చర్) కూడా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని వైద్యులు ప్రకటించడం ప్రతి జనసైనికుడికి, ప్రతి అభిమానికీ ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఒకేసారి రెండు భుజాలకు శస్త్రచికిత్స చేయడం వైద్యపరంగా క్లిష్టమవుతుందని, కోలుకునే ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుతం కుడి భుజానికే శస్త్రచికిత్స నిర్వహించారని, మిగిలిన భుజానికి వైద్యుల సలహా మేరకు రెండు నుంచి మూడు నెలల అనంతరం అవసరమైతే శస్త్రచికిత్స చేపట్టనున్నట్లు వివరించారు.
పవన్ కళ్యాణ్ కి ఈ గాయాలు కావడానికి ప్రధాన కారణం ప్రజల మధ్య నిరంతరం తిరుగుతూ, అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ ఉండడమేనని అన్నారు. అభిమానులు ప్రేమతో చేతులు పట్టుకొని లాగడం వల్లే రోటేటర్ కఫ్ దెబ్బతిన్నప్పటికీ, ఆ బాధను ఎప్పుడూ బయటకు వ్యక్తం చేయకుండా, ప్రజలపైన గానీ, అభిమానులపైన గానీ అసహనం ప్రదర్శించకుండా తన సేవలను నిరంతరం కొనసాగించారని కొనియాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనంత కృపతో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని, పవన్ కళ్యాణ్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వచ్చి మరింత ఉత్సాహంతో ప్రజాసేవను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
Prajavartha Online Telugu News