-ఆంధ్రప్రదేశ్ పర్యాటకులతో గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు
-గవర్నర్ ఆహ్వానం మేరకు అచార్య యార్లగడ్డ నాయకత్వంలో పర్యటన
-మిజోరామ్ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక ప్రసంగం చేయనున్న అచార్య యార్లగడ్డ
మిజోరామ్ , నేటి పత్రిక ప్రజావార్త :
మిజోరామ్ ప్రకృతి సౌందర్య విశేషాలను, పర్యాటక అంశాలను ఇక్కడి ప్రజల ఆదర్శవంతమయిన జీవన విధానాన్ని లోకానికి తెలియ చెప్పాలని మిజోరామ్ గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపు నిచ్చారు. ఎంతో ప్రశాంత రాష్ట్రంగా నీతి, నిజాయితీతో వ్యవహరించే ప్రజలు కలిగిన ప్రాంతంగా మిజోరామ్ ఉందన్నారు. గవర్నర్ హరిబాబు ఆహ్వానం మేరకు విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మభూషణ్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నుండి 16 మంది సభ్యులతో కూడిన పర్యాటక బృందం 5 రోజుల పర్యటనకు మిజోరామ్ వచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ పర్యాటక పరంగా మిజోరామ్ ఎంతో ఆకర్షణీయ రాష్ట్రమని, ఇక్కడి ప్రజలు వినయ సంపన్నులని వివరించారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల లో అమ్మకం దారుడు లేకుండా దుకాణాలు వుంటాయని ఎవరికి వారు కావలసిన వస్తువులు తీసుకుని నగదు అక్కడ పెట్టి వెళ్లిపోతుంటారని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ లో పోలీసులు లేకుండా ప్రజలే స్వీయ నియంత్రణ పాటిస్తారని, ఎన్నికలలో బ్యానర్లు, లౌడ్ స్పీకర్లు, సభలు వుండవని, ఎవరంతట వారు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటారని గవర్నర్ అన్నారు. ఘర్షణ వాతావరణం కనిపించదని, ప్రజలు ప్రశాంత జీవితాన్ని కోరుకుంటారని నిజానికి ఈ విషయాలు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు తెలియవన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి మిజోరామ్ వెళ్లిన బృందానికి గవర్నర్ హరిబాబు రాజభవన్ అతిధి గృహం లో వసతి ఏర్పాటు చేయటమే కాక, వివిధ ప్రాంతాల పర్యటనకు అవసరమైన రవాణా సౌకర్యాలను సమకూర్చారు. ప్రత్యేకంగా వీరికి రాజభవన్ దర్బార్ హాలులో ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. బృందం సభ్యులు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించి. గవర్నర్ దంపతులను సత్కరించగా అతిధులందరికి గవర్నర్ దంపతులు మిజోరామ్ సాంప్రదాయ ఉత్పత్తులను బహుకరించారు. వీరికి అవసరమైన వసతి, భోజన ఏర్పాటులను గవర్నర్ సతీమణి జయశ్రీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, మహిళల తో ప్రత్యేకంగా సమావేశమై విభిన్న విషయాలను తెలసుకున్నారు. మిజోరామ్ విశ్వవిద్యాలయంలో వున్న తెలుగు విధ్యార్దులు, అధ్యాపకులు, అక్కడి హిందీ విభాగంలోని ఆచార్యులతో అచార్య యార్లగడ్డ ప్రత్యేకంగా సమావేశమై ప్రసంగించేలా గవర్నర్ ప్రత్యేక ఏర్పాట్లు చేయ్యటం విశేషం.
Prajavartha Online Telugu News