-మంచి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంది…
-ఆర్పిలకు నూతన ట్యాబ్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బోగస్ ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, మంచి ప్రభుత్వం ప్రజలకు మంచే చేస్తుందని, రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం గోరంట్ల కార్యాలయం నందు మెప్మా సంస్థ సీవోలు, ఆర్పీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత చైతన్యవంతంగా తెలియజేయాలని మహిళలకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ మహిళల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయిందని ఆర్థిక వ్యవస్థలన్నీ గాడి తప్పయని తెలిపారు. అన్ని వ్యవస్థలను సరిచేస్తూ ఒకపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే మరోపక్క పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం అమ్మబడి పేరుతో విద్యార్థులను దగా చేసిందని, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్న ఒకరికి మాత్రమే 13 వేల రూపాయలు వేసిందని, ఈనాడు కూటమి ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి 13 వేల రూపాయలు తల్లుల ఖాతాలోకి జమ చేయడం జరిగిందని, మరొక రెండు వేల రూపాయలను స్కూల్ అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, రాబోయే రోజుల్లో శ్రీనిధి ద్వారా కొంత సొమ్మును చదువుకునే విద్యార్థులకు లోన్ అందించే విధంగా కార్యాచరణ జరుగుతుందని తెలిపారు. సులభతరంగా పని చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు, ఈరోజు ప్రభుత్వం 33 వేల రూపాయల విలువ చేసే నూతన ట్యాబ్ ఫోన్ లను అందిస్తుందని టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, నూతన విధానాలను అలవాటు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఆర్పీలందరికీ నూతన ట్యాబ్ ఫోన్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్స్సేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, మెప్మా సి.ఎం.ఎం రామలక్ష్మి, సి.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News