-ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్ & బి శాఖ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 లక్షలతో రాజానగరంలో నిర్మించనున్న నూతన BPHU (బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్) భవనానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ, రూ.50 లక్షలతో నిర్మించనున్న ఈ BPHU భవనాన్ని ఏడాది లోపు పూర్తి చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుసంధానంగా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్టు తెలిపారు. కోవిడ్ సమయంలో పరీక్షల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం BPHU లను ప్రవేశపెట్టిందని, రాష్ట్రంలో మొదటి విడతలో 166, రెండవ విడతలో 162, మూడవ విడతలో 102 BPHU లు మంజూరు చేయబడ్డాయని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 BPHU లు మంజూరయ్యాయని చెప్పారు. అదనంగా రాష్ట్రంలో 100 PHC లను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో వైద్య రంగంపై నిర్లక్ష్యం వహించారని, కేంద్ర నిధులను దారి మళ్లించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో CHO, ANM, ఆశా వర్కర్లు, 14 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు, ఉచిత మందులు అందించే సదుపాయాలను బలోపేతం చేశామని తెలిపారు. అలాగే 3500 విలేజ్ హెల్త్ & వెల్నెస్ సెంటర్ల నిర్మాణానికి కేంద్ర నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, రాజానగరంలో BPHU ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతాయని, ఈ ప్రాజెక్టు మంజూరు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News