-అభ్యుదయ రైతుకు సన్మానం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నానో ఎరువుల వినియోగం పై విస్తృత ప్రచారం, ఉత్పత్తుల ప్రదర్శన మరియు అవగాహన ముఖ్యమని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ రావు పేర్కొన్నారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ సమావేశంలో అభ్యుదయ రైతులను జిల్లా అధికారులు సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్ మాధవ రావు మాట్లాడుతూ, గత రెండు సీజన్లలో రాజమహేంద్రవరం రూరల్ మండలం, సీతానగరం మండలానికి చెందిన అభ్యుదయ రైతులు నానో ఎరువుల వినియోగం ద్వారా మంచి ఫలితాలు సాధించారని, ఈ కార్యక్రమంలో వారిని గుర్తించి చిరు సన్మానం నిర్వహించామని పేర్కొన్నారు. అవసరానికి మించి యూరియా వాడటం వలన నేల సహజ స్వభావం దెబ్బతింటుందని, సంప్రదాయ యూరియాకు బదులుగా 500 ml నానో యూరియా ఒక 45 కిలోల యూరియా బస్తాను భర్తీ చేస్తుందని, అలాగే నానో యూరియా, నానో DAP వాడకం పంటకు త్వరగా లభించి పెరుగుదలకు దోహదపడుతుందని వివరించారు. రైతులు దీనిని సమర్థంగా వినియోగించాలని సూచించారు. ఆవుపేడ, మూత్రం ఆధారంగా తయారు చేసే జీవామృతం, పంచకవ్యం వంటి సహజ వనరులను వినియోగిస్తూ రైతులు సేంద్రీయ పద్ధతుల్లో పంటలు పండించవచ్చని కూడా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తొర్రేడు మండలానికి చెందిన అభ్యుదయ రైతులు సుంకవల్లి చౌదరి, ఎన్.వి.వి. శ్రీనివాస్, చిన్నకొండేపూడి గ్రామానికి చెందిన జి. నాగరాజు, కె. సతీష్లను ఘనంగా సన్మానించారు. జిల్లా సహకార అధికారి ఎమ్ వెంకట రమణ, డీడి మత్స్య అధికారి టి. నిర్మల కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అనుబంధ అధికారులు, రాజమహేంద్రవరం రూరల్ మండల వ్యవసాయ అధికారి ఎ. భీమరాజు, ఇఫ్కో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News