కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు నియోజకవర్గం ఐ. పంగిడి గ్రామ పరిసరాల్లో ఉన్న క్వారీలలో అక్రమంగా తవ్వకాలు జరిపి, 150 అడుగుల లోతు వరకు ఉన్న ఖనిజ సంపదను తవ్వి, ఆ క్వారీ గోతులను సట్రు మట్టితో పూడ్చకుండానే వదిలివేయడం, అలాగే ఆ గోతుల్లో చెత్త, కొన్ని పరిశ్రమల నుంచి వెలువడే కెమికల్స్ను వదలడం వలన పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో ప్రచురితమైన ప్రతికూల కథనాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గారు తక్షణమే స్పందించి చర్యలు ప్రారంభించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శంకర రావు లతో కూడిన బృందాన్ని క్షేత్రస్థాయిలో పంపించారు.
సదరు అధికారులు గురువారం ఐ. పంగిడి గ్రామ పరిసరాల్లోని క్వారీలను పరిశీలించి, రసాయనాల వాసన, నీటి కలుషణం వంటి అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. క్షేత్రస్థాయి సమీక్ష అనంతరం, తగు నివేదికను సిద్ధం చేసి జిల్లా పరిపాలనకు సమర్పించనున్నట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తులు, సంస్థలపై ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ఇలాంటి నిర్లక్ష్య చర్యలపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News