-నవంబర్ 12న రాజమండ్రి జిజిహెచ్లో ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపు
– డా. కె. వేంకటేశ్వర రావు
– డా. పివివి సత్యనారాయణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిజిహెచ్ రాజమహేంద్రవరం నందు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC) ద్వారా పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు గురైన 0-18 సంవత్సరాల పిల్లలకు నవంబర్ 12న ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. వేంకటేశ్వర రావు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. పివివి సత్యనారాయణ శనివారం ఒక సంయుక్త ప్రకటన లో తెలిపారు.
ఇండో బ్రిటిష్ హాస్పిటల్ విజయవాడకు చెందిన డా. అనూష బృందం ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 0 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఈ పరీక్షలు పూర్తిగా ఉచితం అని అధికారులు పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను నవంబర్ 12 వ తేదీన జిజిహెచ్ మాతా–శిశు విభాగంలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో నిర్వహించే ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపు కు వొచ్చి తగిన వైద్య పరీక్షలు చేయించు కోవాలని విజ్ఞప్తి చేశారు. శస్త్రచికిత్స అవసరమున్న వారికి డా ఎన్టీఆర్ వైద్య సేవా కింద ఉచిత సేవలు అందించబడతాయని తెలిపారు. ఆర్బిఎస్కే కార్యక్రమ అధికారి డా. హరిశ్చంద్ర అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News