-జాబ్ మేళా లో 239 మంది నిరుద్యోగ యువత కు నియమిక పత్రాలు అందచేత
– టి. కనక రాజు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతోందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకరాజు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో ఉద్యోగ మేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాబ్ మేళా లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభించారని చెప్పారు. మహిళా సాధికారతే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం రుణాల మంజూరు, చేతి వృత్తులకు మద్దతు వంటి చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
ఈ ఉద్యోగ మేళాలో రిటైల్, హెల్త్కేర్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, హాస్పిటాలిటీ, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్ రంగాలకు చెందిన 18 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ మేళా నిరుద్యోగ యువతకు, మహిళా ఉద్యోగార్ధులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మంచి వేదికగా నిలిచిందన్నారు. ఈ రోజు జాబ్ మేళా లో ప్రధాన వివరాలు మొత్తం 2165 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా 645 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ లకు హాజరైవారన్నారు. 239 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలు మరియు యువత ఈ అవకాశాలను వినియోగించుకుని, తమ జీవనోపాధిని అభివృద్ధి చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు సూచించారు. అందుకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు. ఈ జాబ్ మేళా లో ఆపరేషన్ మేనేజర్ ఎన్.కార్తీక్, పెద్ద ఎత్తున యువత, మహిళలు, పలు కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News