రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, తూర్పు గోదావరి జిల్లాలోని పాత్రికేయులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం మార్చి 26 గురువారం ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సమన్వయంతో జిల్లా యంత్రాంగం ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ వైద్య శిబిరం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరుగుతుందనీ, ఉదయం 8.30 గంటల నుంచి నమోదుప్రక్రియ ప్రారంభమై అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. సాధారణ వైద్య పరీక్షలతో పాటు రక్తపోటు, రక్తంలో చక్కెర, హిమోగ్లోబిన్, ఈసీజీ, నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, కంటి పరీక్షలు, పిల్లల వైద్య నిపుణులు, గైనకాలజీ, మానసిక వైద్యం వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తారన్నారు. అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, తదుపరి చికిత్స అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తామన్నారు. శిబిరం నిర్వహణకు ప్రత్యేక వైద్య బృందాలు, పారామెడికల్ సిబ్బంది, మొబైల్ వైద్య వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News