గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర సమగ్ర కారిడార్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధాన రహదారుల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, ప్రజా ప్రతినిధుల సూచనలు, సహకారంతో నగరాభివృద్ధిని వేగం చేస్తామని నగర కమిషనర్ కె,మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మహ్మద్ నసీర్, గల్లా మాధవిలతో కలిసి ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయుఐఏఎంఎల్) ప్రతినిధులు రూపొందించిన వివిధ అభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలించారు.
ప్రధానంగా గుంటూరు నగరంలోకి వచ్చే ప్రధాన రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, పివికే నాయుడు మార్కెట్ (జి ప్లస్ 4) వంటి కీలక అభివృద్ధి పనులపై ఏపీయుఐఏఎంఎల్ రూపొందించిన ప్రతిపాదనలను వివరించారు. ఇందులో పివికే నాయుడు మార్కెట్ డబల్ సెల్లార్, గ్రౌండ్ మరియు మొదటి ఫ్లోర్ కూరగాయల మార్కెట్, మిగిలిన 3 ఫ్లోర్ లు కమర్షియల్ కాంప్లెక్స్ లుగా నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. అలాగే తొలి దశలో నగరంలోని 10 జంక్షన్లను, ప్రధానమైన 6 ప్రవేశ మార్గాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుంటూరు నగరంలోని ప్రధాన అవుట్ ఫాల్ డ్రైన్లు (అంబేద్కర్ వాగు, పీకలవాగు)ల అభివృద్ది, చెరువుల పునరుద్ధరణకు జిఎంసి చర్యలు తీసుకుంటుందన్నారు.
ఏపీయుఐఏఎంఎల్ ప్రతిపాదనలపై జిల్లా కల్లెక్టర్ మరియు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, ప్రజా ప్రతినిధుల సూచనలతో తుది డిజైన్ సిద్దం చేయాలని కమిషనర్ ఆదేశించారు.
సమావేశంలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, వేణుగోపాల్, కళ్యాణరావు, ఏపీయుఐఏఎంఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News