రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో శనివారం సాయంత్రం బెంగుళూరు నుండి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్నీ ఏజెన్సీలు, సరఫరా దారులు కృత్రిమ కొరత సృష్టించి, అనవసరంగా పెట్రోల్ కొరత వాతావరణం సృష్టిస్తున్నారని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వారిపై కఠిన నిఘా ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పెట్రోల్ బంక్లపై తనిఖీలు చేపట్టడం, అవసరమైతే ప్రత్యేక బృందాలను నియమించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే, జిల్లాలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేస్తూ, అసత్య ప్రచారాలతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ తెలిపారు. ప్రజలు అపోహలకు లోనవకుండా అధికారిక సమాచారం మేరకు మాత్రమే విశ్వసించాలని, ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతోందని తెలిపారు.
Prajavartha Online Telugu News