-ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు – మే 15లోపు సర్టిఫికేషన్ తప్పనిసరి
-జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రవాణా శాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారి ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్ మరియు కాలేజీ బస్సులపై ప్రత్యేక తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ తనిఖీలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమై కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 108 బస్సులను పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా ప్రమాణాలు, పత్రాల సక్రమతపై సమగ్రంగా తనిఖీలు నిర్వహించ బడినట్లు తెలిపారు.
తనిఖీలలో లోపాలు గుర్తించిన వాహనాలకు నోటీసులు జారీ చేసినట్లు, ముఖ్యంగా ఫిట్నెస్ లేని బస్సులను తక్షణం మరమ్మతులు చేయించి ఈ నెల మే 15 లోపు తిరిగి ఇన్స్పెక్షన్కు హాజరుకావాలని స్పష్టంగా ఆదేశించారు. అనంతరం సంబంధిత వాహనాలు ఏటీఎస్ (ATS) సెంటర్లో ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి అని సూచించారు.
జిల్లాలో మొత్తం 1705 స్కూల్ బస్సులు ఉండగా, వాటిలో 1318 బస్సులు ఇప్పటికే ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందినట్లు, మిగిలిన 387 బస్సులు ఫిట్నెస్ లేనివిగా గుర్తించబడినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో అన్ని స్కూల్, కాలేజీ యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించి, విద్యార్థుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకొని రవాణా శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News