విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర నాయకులు, ప్రజల మనోభావాలను గాయపరుస్తూ, కావాలనే కొందరు వ్యక్తులు చేస్తున్న విమర్శలను ఆంద్రప్రదేశ్ పరిరక్షణ సమితి (ఏపిపిఎస్) ఖండించింది. ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్ పరిరక్షణ సమితి (ఏపిపిఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మసాబత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మసాబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకుం టామని స్పష్టం చేశారు. తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్న ఒక నలుగురు వ్యక్తులు కోట్ల జనాభా గొంతుక తమదే అన్నట్లుగా ప్రవర్తిస్తూ, ఆంధ్ర నాయకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విమర్శల వెనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ హస్తం ఉందని తాము అనుమానిస్తున్నామన్నారు. సదరు వ్యక్తులు వాడుతున్న భాష, యాస, వారి మాట తీరు ఆంధ్ర ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయని, ఆ గాయమే ఈ ఆంధ్ర పరిరక్షణ సమితి ఏర్పాటుకు ముఖ్య పునాది వేసిందని వివరించారు. గత 50 సంవత్సరాల నుంచి ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, మేధావుల కష్టార్జితమే నేటి నవ తెలంగాణ అని గుర్తుచేశారు. గతంలో కేసీఆర్ కూడా ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదని, కానీ ఇప్పుడు కొందరు శక్తులు ప్రపంచస్థాయి నేతలైన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాని కూడా కించపరుస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ ని ప్రధాని మోదీ పరామర్శించడాన్ని తట్టుకోలేకనే, కొందరు ఆంధ్ర రాజకీయాల మీద, చంద్రబాబు మీద నిందలు వేస్తున్నారని ఆరోపించారు. మీ వాగుడుకు భయపడేది లేదు, భవిష్యత్తులో మీకు బలంగా బుద్ధి చెబుతాం అని ఈ సందర్భంగా సమితి తరుపున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లా శ్రీనివాస్ (న్యాయవాది), ప్రధాన కార్యదర్శి షేక్ ఇంతియాజ్ అహ్మద్ (న్యాయవాది), సెక్రెటరీ జనరల్ వేల్పూరి శ్రీనివాస్, సెక్రెటరీ మట్టా ఝాన్సీ మాదిగ, కోశాధికారి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News