గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్, నగరంలోని ప్రధాన రోడ్ల వెంబడి మెరుగైన పారిశుధ్యం ఉండాలని, అవసరమైతే 3 షిఫ్ట్ లుగా పారిశుధ్య పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సిఎం సాయి కాంత్ వర్మ జిఎంసి అధికారులను ఆదేశించారు. గుంటూరు నగర పరిధిలోని జాతీయ రహదారిలో కాకాని రోడ్ వై జంక్షన్ నుండి చిలకలూరిపేట వై జంక్షన్ వరకు సర్వీస్ రోడ్, నగరంలోని ప్రధాన కూడళ్లను నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిఎంసి విభాగాధిపతులు, అధికారులతో సమీక్షించారు. తొలుత ఏపియుఐఏఎంఎల్ ప్రతినిధులు రూపొందించిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కి నగర కమిషనర్ నగరంలోని ప్రధానమైన జంక్షన్లు, రహదారుల అభివృద్ధి పై ప్రతిపాదనలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో జంక్షన్ ల వద్ద టేబుల్ టాప్ లు పక్కగా ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు అనువుగా జంక్షన్ లు ఉండాలని, హై మాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయు స్థలం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయు స్థలం శాస్త్రీయంగా ఉండాలని ఆదేశించారు. జంక్షన్ వద్ద ఫౌంటైన్ లు ఏర్పాటు చేయాలని వాటికి కావలసిన సామర్థ్యం గల పరికరాలు పెట్టాలని, ప్రతి చోటా ఆకర్షణీయంగా ఉండాలని స్పష్టం చేశారు. జంక్షన్ లు, మీడియన్ లు, రహదారులలో ఏర్పాటు చేసే విద్యుత్ దీపాలు సైతం శాస్త్రీయంగా ఉండాలని అన్నారు. అభివృద్ధి అనంతరం ఆయా జంక్షన్ల వద్ద ఎటువంటి ప్రకటనల హోర్డింగ్స్ లేదా బోర్డ్ లు, కేబుల్స్ ఉండడానికి వీలు లేకుండా జిఎంసి పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధికి ప్రతిపాదించిన జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రయల్ రన్ చేయాలన్నారు. జంక్షన్లు, రహదారుల అభివృద్ధికి 2 రోజుల్లో టెండర్స్ పిలవాలన్నారు.
అలాగే నగరంలో విజిబుల్ క్లీనింగ్ ఉండాలని, అందుకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్లకు ఎండ్ టు ఎండ్ క్లీనింగ్ ఉండాలని, అవసరమైతే అదనపు కార్మికులను కేటాయించుకోవాలన్నారు. ఈ నెలాఖరు నాటికి నగరంలో షుమారు 80 వేల మొక్కలను నాటే లక్ష్యం ఉండాలని, అందులో ఎవెన్యూ ప్లాంటేషన్ కి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మొక్కలను నిర్దేశిత క్రమ పద్దతిలో నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పార్క్ లతో పాటు అదనంగా పార్క్ ల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన కార్యాచరణ సిద్దం చేయాలని ఏడిహెచ్ ని ఆదేశించారు.
సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, డిసిపీ సూరజ్ కుమార్, బయాలజిస్ట్ శేషయ్య, విఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు, ఏపియుఐఏఎంఎల్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News