-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ మోర్చా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా దళిత సాధికారత, సామాజిక న్యాయం, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో దళితులను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. దళితుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయ డప్పు కళాకారులు, వారి కళను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా, హిందూ ధర్మాన్ని అవమానించేలా, విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే, సంఘ విద్రోహ కార్యకలాపాలను ప్రోత్సహించే శక్తులను ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు.
ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ మాట్లాడుతూ, రాబోయే మూడు నెలల్లో చేపట్టనున్న కార్యక్రమాల కార్యాచరణను వివరించారు. దళిత సమాజంలోని అన్ని ఉపకులాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి ఎన్. మధుకర్, రాష్ట్ర పదాధికారులు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News