గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని జంక్షన్లను అధునాతన విధానంలో ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం కాకాని రోడ్ వై జంక్షన్, బస్టాండ్ దగ్గరలోని ఎన్టీఆర్ విగ్రహం సెంటర్, పాత పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదురు జంక్షన్, జిన్నాటవర్ సెంటర్, జిఎంసి ఆఫీస్ ఎదుట, హిందూ కాలేజీ సెంటర్ లోని జంక్షన్, నాజ్ సెంటర్, చుట్టగుంట జంక్షన్, కలెక్టరేట్ జంక్షన్ లను ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్), నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ట్రాఫిక్ పోలీసులతో కలిసి పరిశీలించి, జంక్షన్ల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరం రాష్ట్ర రాజధానిలో భాగంగా ఉన్నందున నగరంలో అధునాతన హంగులతో జంక్షన్లు, పార్కులు, సెంట్రల్ డివైడర్లు, అవేన్యూ ప్లాంటేషన్ లను అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జంక్షన్లను అభివృద్ధికి ఏపియుఐఎయంయల్ తయారు చేసిన ప్రతిపాదనలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, తగు సూచనలు చేశామని, తుది డిజైన్లను త్వరగా సిద్దం చేయాలని ఆదేశించామన్నారు. ఆయా జంక్షన్లలో లైటింగ్, గ్రీనరీ, ఫుట్ పాత్ లు, ట్రాఫిక్ సిగ్నల్, సైన్ బోర్డ్ లు, వాటర్ ఫౌంటెన్లను ఆధునిక విధానంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏపియుఐఎయంయల్ ప్రతిపాదనల మేరకు క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ట్రయిల్ చేయాలని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఏసిపీలు రెహ్మాన్, జకియా, డిఈఈలు హనీఫ్, చైతన్య, పెద్దకాకాని సిఐ నారాయణస్వామి, ఏపియుఐఎయంయల్ రాజేష్ మరియు వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News