పరిహారం ఇవ్వకుండా మత్స్యకారుల కుటుంబాలను వేధించిన వైసీపీ

– గత ప్రభుత్వ పెండింగ్ బకాయిలైన రూ.13.05 కోట్లను అధికారంలోకి రాగానే చెల్లించాం
– వైసీపీ హయాంలో మత్స్యకారులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు
– విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాం
– రాజకీయ లబ్ధి కోసం మత్స్యకారుల సమస్యలను వాడుకోవడం జగన్‌కు తగదు
– వ్యవసాయ, మత్స్యశాఖల‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, ఇతర పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెండింగ్ బిల్లులను కూటమి ప్రభుత్వం చెల్లించి బాధిత కుటుంబాలకు న్యాయం చేసిందని తెలిపారు. అలాంటి పరిస్థితులు సృష్టించిన జగన్ ఇప్పుడు మత్స్యకారుల గురించి మాట్లాడటం, తన సొంత పత్రికలో తప్పుడు రాతలు రాయించడం విడ్డూరంగా ఉందని, విమర్శలు చేసే ముందు తన ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మత్స్యకారుల సంక్షేమం పేరుతో ప్రచారం చేసుకున్న మాజీ సియం జగన్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న 63 ఎక్స్‌గ్రేషియా క్లెయిమ్‌లకు సంబంధించిన రూ.3.15 కోట్లను 2024 జూలై 8న విడుదల చేసి బాధిత కుటుంబాలకు అందజేశామని చెప్పారు. అలాగే ప్రభుత్వం లో పెండింగ్‌లో ఉన్న రూ.9.90 కోట్ల డీజిల్ (ఆయిల్) సబ్సిడీ బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 జూన్ నెలలో విడుదల చేసి మత్స్యకారులకు అందించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంటూ తగిన న్యాయం చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం లాగా ఎటువంటి వైఫల్యాలు లేకుండా వారికి సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ఇటీవల విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన విస్తృత గాలింపు చర్యలు చేపట్టిందన్నారు. భారత కోస్ట్ గార్డ్, భారత నౌకాదళం, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, విశాఖపట్నం పోర్టు అథారిటీతో పాటు సంబంధిత అన్ని సంస్థల సమన్వయంతో నిరంతర గాలింపు కొనసాగించామ‌ని తెలిపారు. మత్స్యకారులు గల్లంతైన సమాచారం ప్రభుత్వానికి ఆలస్యంగా అందినప్పటికీ విషయం తెలిసిన వెంటనే యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అత్యవసర చర్యలు ప్రారంభించామని చెప్పారు. అలాగే సాంకేతిక లోపం కారణంగా ఒడిశా తీరానికి సమీపంలో సముద్ర మధ్యలో చిక్కుకుపోయిన 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి సురక్షితంగా రక్షించిందని మంత్రి తెలిపారు. ఒడిశా ప్రభుత్వ అధికారులతో నేరుగా సమన్వయం చేసి సంబంధిత యంత్రాంగాన్ని రంగంలోకి దింపడం ద్వారా మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడమే కాకుండా, వారికి అవసరమైన వైద్య సహాయం అందించి అనంతరం క్షేమంగా విశాఖపట్నానికి తరలించామని వెల్లడించారు. మత్స్యకారుల ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తుంటే, అలాంటి సమయంలో కూడా రెడ్డి ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బాధాకరమని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మత్స్యకారులకు భరోసా కల్పించాల్సిన సమయంలో వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించటం పూర్తిగా బాధ్యతారాహిత్యమన్నారు.

గత ప్ర‌భుత్వం హ‌యాంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని ప్రచారం చేసుకుందని, కానీ క్షేత్రస్థాయిలో ఆ సాయం సకాలంలో అందక బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో సముద్ర వేటకు వెళ్లి ఎంతమంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారనే విషయంపై ఇప్పటివరకు ఒక అధికారిక శ్వేతపత్రం కూడా విడుదల చేయలేదని మంత్రి ప్రశ్నించారు. మత్స్యకారుల ఓట్ల కోసం ‘భరోసా’ పేరుతో ప్రచారం చేసిన గత పాలకులు వేటలో మరణించిన మత్స్యకారుల ఖచ్చితమైన సంఖ్యను ప్రజలకు ఎందుకు వెల్లడించలేదని నిలదీశారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, వచ్చిన క్లెయిమ్‌లలో అనేక దరఖాస్తులను బడ్జెట్ లేదనే కారణంతో సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచిందని మంత్రి విమర్శించారు. మొదటి రెండేళ్లలో వచ్చిన 116 క్లెయిమ్‌లలో 52 క్లెయిమ్‌లను సుదీర్ఘకాలం పరిష్కరించకుండా వదిలేసిన విషయాన్ని గుర్తు చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో కనీస భద్రతా చర్యలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంత్రి ఆరోపించారు. రిప్ కరెంట్లు, పాత బోట్ల కారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ, వాటి పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించలేదన్నారు. మరణాల సంఖ్య బయటపడితే ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమవుతుందనే భయంతో అధికారిక సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకురాలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మత్స్యకారుల కష్టాలను రాజకీయ ప్రచారానికి మాత్రమే పరిమితం చేసిన వైసీపీ ప్రభుత్వం, వారి సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితం కాకుండా మత్స్యకార కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరే నిర్ణయాలు తీసుకుంటూ వారి సంక్షేమానికి అండగా నిలుస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *