-చిరుత సంచారం ఉన్న ప్రాంతాల్లో హనుమాన్ బృందాలు
-అటవీ శాఖ, టీటీడీ అటవీ విభాగం సమన్వయంతో పని చేయాలి
-భక్తులు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల అలిపిరి కాలినడక మార్గంలోని దొరసాని మండపం సమీపంలో చిరుతపులి సంచారంపై నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అదేశించారు. భక్తుల ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెట్ల మార్గంలో చిరుత సంచారం అంశాన్ని కార్యాలయ అధికారులు ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. యాత్రికుల భద్రత కోసం అటవీశాఖ, టీటీడీ అటవీ విభాగం, టీటీడీ విజిలెన్స్ విభాగాల సమన్వయంతో తీసుకుంటున్న చర్యలను వివరించారు. హనుమాన్(H.A.N.U.M.A.N.) బృందాలను కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ధేశించారు. భక్తులను నిరంతరం అప్రమత్తం చేయాలని, సున్నితమైన ప్రాంతాల్లో దట్టమైన పొదలను తొలగించి వ్యూలైన్స్ సిద్ధం చేయాలని సూచించారు. భక్తులు గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్లేలా ముందస్తు అవగాహన కల్పించాలని చెప్పారు. చిరుత సంచారం వార్తల పట్ల భక్తులు ఆందోళనకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
Prajavartha Online Telugu News