-“మిషన్ మార్చ్ SSC-2027” కార్యాచరణ ప్రారంభం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు ఎస్ఎస్సీ (SSC) పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ “మిషన్ మార్చ్ SSC–2027: నూటికి నూరు శాతం విజయమే లక్ష్యం – యాక్షన్ ప్లాన్ ఫేజ్-I” (Mission March SSC–2027: A Leap Towards 100% Success – Action Plan Phase-I) ను ప్రారంభించింది.
ఈ ప్రత్యేక కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP-2020), జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (NCF-2023) మార్గదర్శకాలకు అనుగుణంగా, ఎన్సీఈఆర్టీ (NCERT) కి చెందిన ‘పరాఖ్’ (PARAKH) సంస్థ సిఫార్సు చేసిన సామర్థ్య ఆధారిత విశ్లేషణ విధానానికి (Competency-based assessment framework) అనుగుణంగా రూపొందించబడింది.
కార్యక్రమ ముఖ్య విశేషాలు:
ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 13 జూలై 2026 నుండి 30 నవంబర్ 2026 వరకు అమల్లో ఉంటుంది.
ప్రత్యేక సమయం: పాఠశాల పని దినాల్లో రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రత్యేక విద్యా మద్దతు సెషన్ (Academic support session) నిర్వహిస్తారు. ఇందులో సబ్జెక్టుల పునర్విమర్శ (Revision) మరియు సామర్థ్య ఆధారిత స్లిప్ టెస్ట్లు (Slip Tests) ఉంటాయి.
డిజిటల్ మద్దతు (లీప్ యాప్): ప్రభుత్వ పరీక్షల బోర్డు (BSE) ఈ కార్యక్రమానికి సంబంధించి రోజువారీ షెడ్యూల్స్, క్వశ్చన్ బ్యాంకులు, స్టడీ మెటీరియల్ మరియు స్లిప్ టెస్ట్లను ప్రత్యేకంగా రూపొందించిన LEAP App, BSE వెబ్ సైట్లో పొందుపరచడం జరుగుతుంది.
వైవిధ్యభరిత బోధనా పద్ధతి
(Differentiated Learning): విద్యార్థుల స్థాయిని బట్టి రెండు విభాగాలుగా బోధన సాగుతుంది:
1. రైజింగ్ స్టార్స్ (లెవెల్–1): కనీస అభ్యసన నైపుణ్యాలు మరియు పునాదిని బలోపేతం చేయడం కోసం.
2. షైనింగ్ STARS (లెవెల్–2):* ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఉన్నత స్థాయి సామర్థ్యాలను పెంపొందించడం కోసం.
ఉపాధ్యాయుల పాత్ర: ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వెనుకబడిన వారికి ప్రత్యేక బోధన (Remedial support) అందిస్తారు. అలాగే ప్రతిభావంతులకు తగిన మార్గదర్శకత్వం చేస్తూ ప్రగతి రికార్డులను క్రమబద్ధంగా నమోదు చేస్తారు.
నిరంతర పర్యవేక్షణ: ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు కావడానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (Headmasters) మరియు విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.
“విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారిని రేపటి సవాళ్లకు సిద్ధం చేసేందుకే ఈ సామర్థ్య ఆధారిత అభ్యసన కార్యక్రమాన్ని తీసుకువచ్చాం” అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా IAS., పేర్కొన్నారు.
రాబోయే *SSC పబ్లిక్ పరీక్షలు–2027* లో ప్రతి పదో తరగతి విద్యార్థి అత్యుత్తమ విజయం సాధించేలా… ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యా రంగానికి చెందిన భాగస్వాములందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.
Prajavartha Online Telugu News