మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశాలు, జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా మేజిస్ట్రేట్ డి.కె. బాలాజీ గారి సూచనల మేరకు పెడన పట్టణంలోని చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం జూలై 13, 2026 (సోమవారం) ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు మూడు చేనేత సహకార సంఘాల ప్రాంగణాల్లో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పి. యుగంధర్ తెలిపారు.
వైద్య శిబిరాలు నిర్వహించనున్న కేంద్రాలు:
సదా శివలింగేశ్వర వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ, మఠం, బ్రహ్మాపురం
నార్త్ పెడన గాంధీ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ, బంగ్లా స్కూల్ సమీపంలో, పెడన
చౌడేశ్వరి రామలింగేశ్వరి వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ, వీరభద్రపురం
ఈ శిబిరాల్లో చేనేత కార్మికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన వైద్య సేవలు, మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉచితంగా అందజేయనున్నారు. అలాగే అవసరమైన వైద్య సలహాలు, తదుపరి చికిత్సకు సంబంధించిన సూచనలు కూడా వైద్యులు అందిస్తారు.
ఈ కార్యక్రమం కోసం యూపీహెచ్సీ బ్రహ్మాపురం, పీహెచ్సీ పెడన, పీహెచ్సీ చినపండ్రాకకు చెందిన వైద్యాధికారులు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (MLHPలు), మహిళా ఆరోగ్య సిబ్బంది (WHS), ఆశా కార్యకర్తలను ప్రత్యేకంగా నియమించినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. వైద్య శిబిరాలకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, బ్యానర్లు తదితర ఏర్పాట్లను యూపీహెచ్సీ బ్రహ్మాపురం ద్వారా సమకూర్చాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
అదనంగా వివిధ స్పెషాలిటీలకు చెందిన నిపుణ వైద్యులను కూడా శిబిరాల్లో సేవలందించేందుకు నియమించారు. వీరిలో జనరల్ మెడిసిన్, దంత వైద్యం, నేత్ర వైద్యం, స్త్రీ, ప్రసూతి వైద్యం, జనరల్ సర్జరీ నిపుణులు పాల్గొని చేనేత కార్మికులకు అవసరమైన వైద్య సేవలు అందించనున్నారు.
చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. యుగంధర్ విజ్ఞప్తి చేశారు. శిబిరాల నిర్వహణకు నియమితులైన వైద్యులు, సిబ్బంది విధులకు తప్పనిసరిగా హాజరై విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News