విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ITI) నందు వివిధ ట్రేడులలో మిగిలివున్న సీట్ల భర్తీ కొరకు ఈ నెల 15వ తేదీన “జనరల్ పూల్ కౌన్సిలింగ్” నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్, కన్వీనర్ ఎం. కనక రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఐ.టి.ఐ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసుకుని, ఇంతవరకు సీటు రాని వారు, గత కౌన్సిలింగ్కు హాజరుకాని అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ బుధవారం ఉదయం 8:00 గంటలకు విజయవాడలోని ప్రభుత్వ ఐ.టి.ఐ ఆవరణలో జరిగే కౌన్సిలింగ్కు నేరుగా హాజరుకావలసి ఉంటుందన్నారు. కౌన్సిలింగ్ ద్వారా సీటు పొందిన అభ్యర్థులలో ఎస్.సి (SC), ఎస్.టి (ST) కేటగిరీలకు చెందిన వారు మినహా, మిగిలిన అభ్యర్థులందరూ రూ. 60/- కాషన్ డిపాజిట్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కౌన్సిలింగ్కు వచ్చే అభ్యర్థులు తమ వెంట తప్పనిసరిగా 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ (T.C), కుల ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ (EWS) పత్రం (వర్తించే వారికి), ఆధార్ కార్డ్ మరియు స్టడీ సర్టిఫికెట్ల ఒరిజినల్ ప్రతులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని వారిని కౌన్సిలింగ్కు అనుమతించబోరని, ఒకవేళ ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన వారు ఉంటే దానికి సంబంధించిన ధృవీకరణ పత్రంతో హాజరుకావచ్చని తెలిపారు. ఇతర సమాచారం మరియు పూర్తి వివరాల కోసం 0866-2475575, 94906 39639, లేదా 77804 29468 నంబర్లను సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ ఆ ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News