-‘తల్లికి వందనం’ ఫిర్యాదులన్నీ ప్రభుత్వానికి పంపిస్తున్నాం – ఎమ్మెల్యే బొండా ఉమ
-ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి – గద్దె అనురాధ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ (PGRS) కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
అధికారం తమకు అలంకారం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని పేర్కొన్న ఆయన, ప్రజలు సమర్పించిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి, సమస్య పరిష్కారం జరిగే వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. వెంటనే పరిష్కారం సాధ్యం కాకపోయినా, ఎప్పుడు పరిష్కారం అవుతుందో ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.
ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ఇచ్చిన ప్రతి అర్జీకి స్పందన లభిస్తుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈరోజు ముఖ్యంగా ‘తల్లికి వందనం’ పథకం కింద లబ్ధి అందని వారు పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్కు వచ్చారని చెప్పారు. వారి నుంచి గ్రీవెన్స్ దరఖాస్తులు స్వీకరించి, ప్రతి అర్జీకి ప్రత్యేక నంబర్ కేటాయించి ప్రభుత్వానికి పంపిస్తున్నామని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మ్యాపింగ్ సిస్టమ్ కారణంగా ఇల్లు, విద్యుత్ కనెక్షన్, ఆదాయపు పన్ను, నాలుగు చక్రాల వాహనం లేదా ఇతర వివరాల ఆధారంగా కొంతమంది అనర్హుల జాబితాలో కొనసాగుతున్నారని, అందువల్ల గత ఏడాది లబ్ధి పొందిన కొందరికి ఈసారి “తల్లికి వందనం” అందలేదని, మరికొందరికి తక్కువ మొత్తం జమైందనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శాసనసభ్యుల కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, రాబోయే రోజుల్లో మరింత బాధ్యతతో ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు.
అనంతరం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తో పాటు వారి ఇద్దరి కుమారులు ప్రతిరోజు “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రజల ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, ప్రజల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. అదే సమయంలో కొందరు ఇంటి స్థలాల సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చారని, ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అర్హులైన వారికి ఇంటి స్థలాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి సూచనలు, సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ద్వారానే మంచి పాలన సాధ్యమవుతుందని, “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం అదే లక్ష్యంతో కొనసాగుతోందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు NDA కూటమి రాష్ట్ర నాయకులు జిల్లాస్థాయి నాయకులు సెంట్రల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఇన్చార్జులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News