-ఏఐటీయూసీ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ వర్క్షాప్లోని జోనల్ స్టోర్స్లో గత దాదాపు 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న 17 మంది కార్మికులను ఎటువంటి ముందస్తు సమాచారం, నోటీసు లేకుండా ఉన్నఫలంగా విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట సుబ్బయ్య బుధవారం విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, జోనల్ స్టోర్స్లో సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తూ ఆర్టీసీ సంస్థ కార్యకలాపాలకు తమ శ్రమను అందించిన 17 మంది కార్మికులను ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.గత పది సంవత్సరాలుగా నిరంతరంగా పనిచేసిన కార్మికుల సేవా కాలం, అనుభవం, సంస్థకు అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని ఆయన అన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసు, ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లు లేకుండా కార్మికులను విధుల నుంచి తొలగించడం వల్ల వారి జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు.సంవత్సరాల తరబడి పనిచేసిన కార్మికులను అకస్మాత్తుగా తొలగించడం ద్వారా వారి కుటుంబాలను రోడ్డున పడేయడం సరికాదని, కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన కోరారు.విజయవాడ జోనల్ స్టోర్స్లో తొలగించిన 17 మంది కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను కోరినట్లు ఎస్.వెంకట సుబ్బయ్య తెలిపారు.కార్మికుల సమస్యను సానుకూలంగా పరిశీలించి, వెంటనే న్యాయం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బాజీ, కార్మికులు రాము, శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News