-భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరంలో బుధవారం ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ టౌన్ క్లబ్, నాలుగుకాళ్ల మండపం, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ మీదుగా కచ్చపి ఆడిటోరియం వరకు కొనసాగింది. జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో బైకులతో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ర్యాలీ అనంతరం కచ్చపి ఆడిటోరియంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పిఠాపురంలో జరిగిన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా LED స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, 2024లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని అన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ వంటి అంశాలకు ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలతో నేరుగా మమేకమవుతూ సమస్యలను తెలుసుకునే విధానం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రజల నుంచి మంచి స్పందన పొందుతున్నాయని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సేవకు మరింత ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నారని, ఆయనపై ప్రజల్లో ఉన్న విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని డా. హరిప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయ, ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత కాలం సేవలు అందిస్తూ, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News