-ఆర్థికేతర సమస్యల పరిష్కారంపై త్వరగా ఉత్తర్వులిస్తాం
-నిర్ణయాత్మక కమిటీలో జేఏసీ ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తాం
-ఆందోళనను వాయిదా వేయాలి
-జెఎసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ విజ్ఞప్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బదిలీల నిర్వహణపై నిర్దిష్టమైన విధానాన్ని(పాలసీ) రూపొందిస్తామని కాంట్రాక్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)కి వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ హామీ ఇచ్చారు. ఇందులో బదిలీలు ఎలా, ఎప్పుడు ఏయే కేటగిరీ (మ్యూచువల్, విజ్ఞప్తులు, స్పౌజ్, ఇతర) ఎటువంటి పద్దతుల్ని అవలంబించాలన్న దానిపై పాలసీని తయారు చేస్తామని చెప్పారు. ఈ బదిలీలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఏర్పాటు చేసే కమిటీలో జెఎసి సభ్యులను కూడా భాగస్వాములను చేస్తామని వెల్లడించారు. ఆర్థికేతర సమస్యల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అయితే, ఉద్యోగ సర్వీసుల క్రమబద్ధీకరణ, 100 శాతం గ్రాస్ వేతన చెల్లింపు తమ పరిధిలో లేదని, ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం జరగాల్సి ఉందని చెప్పారు. జెఎసి విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, ఉన్నత స్థాయిలో చర్చించేందుకు తగిన సమయం అవసరమైనందున ఆందోళన కార్యక్రమాలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని, రోగులు ఇబ్బందులు పడకూడదని జెఎసి ప్రతినిధులను కోరారు.
తాడేపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 3 గంటల పాటు రెండో విడత జేఏసీ ప్రతినిధులతో కార్యదర్శి జి.వీరపాండియన్తో పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్బాబు, ఆయుష్ కమీషనర్, వైద్య,ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా కార్యదర్శి వీరపాండియన్ మాట్లాడుతూ మెటర్నిటీ, చైల్డ్ కేర్, మెడికల్ లీవులు, ఇతర విజ్ఞప్తుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. రాత్రి విధుల (Night Duty) కేటాయింపులో రొటేషన్ పద్ధతిని పక్కాగా అమల్లోకి తెస్తామన్నారు. ఏ ఒక్కరిపైనే భారం పడకుండా అందరికీ 12 గంటల నైట్ డ్యూటీ పద్ధతి వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది లీవుల అంశంపై తగిన ఆదేశాలు ఇస్తామన్నారు. ఏజెన్సీ/గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలను నిబంధనల ప్రకారం కాపాడతామని తెలిపారు. ఏలూరు జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో నిధి పోర్టల్ లో ఉద్యోగుల వివరాల నమోదును వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు.
ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం ప్రభుత్వానిదే..
ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం తమ పరిధిలో లేదని, ప్రభుత్వపరంగా దీనిపై నిర్ణయం జరగాల్సి ఉందని కార్యదర్శి వీరపాండియన్ చెప్పారు. అలాగే 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలంటే ప్రభుత్వంపై ఏడాదికి రూ.331 కోట్లు అదనంగా భారం పడుతుందని చెప్పారు. రోగులకు వైద్య సేవల్లో లోపం తలెత్తకూడదని, ఆందోళనను కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలని, ఈలోగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ చక్రధర్ బాబు జెఎసి ప్రతినిధులను కోరారు.
పీహెచ్సీల్లో విద్యార్థులకు శిక్షణపై జేఏసీ చేసిన విజ్ఞప్తి మేరకు ఉత్తర్వుల జారీ
డీఎంఎల్టీ, బీఎస్సీ (ఎంఎల్టీ) విద్యార్థులు తమ 6/12 నెలల క్లినికల్ శిక్షణలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలపాటు వైద్య శిక్షణ పొందాలని వైద్య విద్యాశాఖ ఆదేశించింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారుల ద్వారా విద్యార్థులకు శిక్షణ కేంద్రాలను కేటాయించనున్నారు. సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, విద్యార్థి చదువుతున్న సంస్థ సూపరింటెండెంట్ శిక్షణ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి. ఈ ధ్రువీకరణ పత్రాన్ని నమోదు సమయంలో లేదా కోర్సు ధ్రువీకరణ పత్రం జారీ చేసే సమయంలో తప్పనిసరిగా సమర్పించాలి. ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాతే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనుబంధ ఆరోగ్య వృత్తి నిపుణుల మండలి ద్వారా కోర్సు ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని ఉత్తర్వుల్లో డిఎంఈ డాక్టర్ విష్ణువర్దన్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News