విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు జాతీయ ఆహార భద్రతా పథకం అమల్లో భాగంగా రెండవ రోజు ఎన్టీఆర్ జిల్లాలో అధికారంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ రూరల్ నున్న, పూత పాడు సింగ్ నగర్ ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరు పై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముందుగా నున్న గ్రామంలో రేషన్ షాపు పరిశీలించి లబ్ధిదారులకి త్వరితగతిన ఆహార ధాన్యాలు అందజేయాలని ఆజ్ఞాపించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందుతున్న పోషకాహారం నాణ్యత పై పలు సూచనలు చేశారు. అదేవిధంగా పిల్లల హాజరు పట్టిలో బ్లాంక్స్ లేకుండా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా నిర్వహించాలని హెచ్చరించారు. అక్కడే ఉన్న మరో కేంద్రాన్ని సందర్శించి గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందించే మాతృ వందన యోజన పనితీరుపై ఆరా తీశారు. స్టాక్ రికార్డుల్లో తప్పులు దొరలకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ తనిఖీ చేసిన ఆయన పరిసరాల పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని విద్యార్థులు స్నానపు గదుల దగ్గర ఎప్పటికప్పుడు శానిటేషన్ విధిగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు అందించి ఆహారం విషయంలో పోషక విలువలు కోల్పోకుండా ఉండాలంటే గంజి వార్చకుండా ఉడికించాలని వంట మనుషులకు సూచనలు చేశారు. నున్న జిల్లా పరిషత్ స్కూల్ సందర్శించిన ఆయన వంటశాల తరగతి గదులు పరిశీలించారు. స్టాక్ రికార్డులో హెడ్మాస్టర్ సంతకాలు లేకపోవడాన్ని తప్పు పట్టి వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులనీ కోరారు. స్కూల్ అభివృద్ధికి దోహదపడిన దాతల్ని అభినందించారు. చివరగా ఎంకే బేగ్ హై స్కూల్ తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల మధ్యాహ్నం భోజన పథకం నాణ్యతని పరిశీలించారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక విద్యార్థి నడుం బిగించాలని హితబోధ చేశారు. స్కూల్ విద్యార్థులు చేసిన పలు కార్యక్రమాలకు ఆకర్షితులై వారి ప్రతిభ పట్ల పూర్తిస్థాయి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారీ పి వాణి, ఐసిడిఎస్ అధికారులు విద్యాశాఖ అధికారులు వివిధ హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు తూనికల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News