Breaking News

మలేరియా నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ విధానాలకు జాతీయ నిపుణుల ప్రశంసలు

-1 నుంచి శుక్రవారం వరకు జిల్లాల్లో పర్యటించిన కేంద్ర నిపుణుల బృందాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మలేరియా నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్‌ అమలు చేస్తున్న వినూత్న విధానాలను జాతీయ స్థాయి నిపుణుల బృందాలు ప్రశంసించాయి. వ్యాధి నిఘా, కేసుల నిర్వహణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ–ప్రైవేటు సమన్వయంలో రాష్ట్రం అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను గుర్తించాయి. సీఎం డ్యాష్‌బోర్డు, ‘అవేర్‌’ వ్యవస్థ, డ్రోన్‌ సాంకేతికత, ఫీడర్‌ అంబులెన్స్‌లు, ‘ఫ్రైడే–డ్రై డే’, ఐహెచ్‌ఐపీ, ఎల్‌ఎల్‌ఐఎన్‌ల పంపిణీని ప్రత్యేకంగా ప్రస్తావించాయి.

నాలుగు రాష్ట్రాల్లో మలేరియా కార్యక్రమంపై సమీక్ష

2027–2032 జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఒడిశాలో మలేరియా నియంత్రణ కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర నిపుణుల బృందాలు సెప్టెంబరు 1 నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో పర్యటించాయి. మలేరియా ప్రభావిత అల్లూరి సీతారామరాజు, ప్రభావం లేని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టాయి.

ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ చక్రధర్‌బాబుతో ఫ్రైడే నైట్‌ మీటింగ్‌

నాలుగు రోజుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కేంద్ర నిపుణుల బృందాలు శుక్రవారం రాత్రి హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ చక్రధర్‌బాబు, ఇతర అధికారులతో మంగళగిరిలోని ఏపీఐసీసీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నాయి. పలువురు సభ్యులు వర్చువల్గా హాజరయ్యారు. ప్రొఫెసర్‌ డాక్టర్‌ కామిని మెండిస్‌, డాక్టర్‌ నిర్మల్‌ జో, డాక్టర్‌ లోకేశ్‌ కోరి, డాక్టర్‌ ఆర్య రాహుల్‌, డాక్టర్‌ పి.కె. సేన్‌, డాక్టర్‌ ప్రణబ్‌ జె. భుయాన్‌, డాక్టర్‌ బద్రి థాపా పాల్గొన్నారు. సీఎం డ్యాష్‌బోర్డు ద్వారా వ్యాధి నిఘా, ‘అవేర్‌’ వ్యవస్థ ద్వారా కేసుల పరిస్థితి అంచనా, నిర్వహణను పర్యవేక్షిస్తున్న విధానాన్ని నిపుణులు ప్రశంసించారు.

గిరిజన ప్రాంతాల్లో డ్రోన్‌ సాంకేతికత వినియోగం

చేరుకోవడం కష్టమైన గిరిజన, మారుమూల ప్రాంతాల్లో రోగుల నిర్ధారణ, చికిత్స కోసం డ్రోన్‌ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తున్న తీరును నిపుణులు గుర్తించారు. రోగులను సమీప ఆసుపత్రులకు తరలించేందుకు ఫీడర్‌ అంబులెన్స్‌ సేవలు అందిస్తున్న విధానాన్ని కూడా ప్రశంసించారు.

ప్రజల్లో అవగాహనకు ‘ఫ్రైడే–డ్రై డే’

దోమల వృద్ధి ప్రదేశాలను గుర్తించి తొలగించడం, మలేరియా, డెంగీ తదితర వెక్టర్‌ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ‘ఫ్రైడే–డ్రై డే’ కార్యక్రమాన్ని బృందాలు ప్రశంసించాయి. మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఎల్‌ఎల్‌ఐఎన్‌ల పంపిణీ, వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని కూడా గుర్తించాయి.

ప్రభుత్వ చర్యలకు నిపుణుల ప్రశంసలు

మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఎల్‌ఎల్‌ఐఎన్‌ల పంపిణీ, ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలు సమర్థవంతంగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణ, కేసులను ముందుగానే గుర్తించి సకాలంలో నిర్వహిస్తున్న విధానం అభినందనీయమన్నారు. రాష్ట్రం అనుసరిస్తున్న సమగ్ర విధానం మలేరియా నియంత్రణలో మెరుగైన ఫలితాలకు దోహదపడుతోందని ప్రశంసించారు.

బలోపేతానికి సూచనలు

వ్యాధి నిఘా, ముందస్తు నిర్ధారణ, సకాలంలో చికిత్స, దోమల నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని నిపుణులు సూచించారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *