Breaking News

అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి మచిలీపట్నం పోర్టు అభివృద్ధి, జల్ జీవన్ మిషన్ పనులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల వినియోగం, మచిలీపట్నంలో డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన సమయానికి అప్పగించిన పనులను పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాకు తలమానికమైన మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రతివారం పురోగతి పనుల వివరాలను తెలియజేయాలని సూచించారు. పోర్టు నిర్మాణానికి సంబంధించిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీటి సరఫరాకు సంబంధించిన పైప్ లైన్ నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఆరా తీస్తూ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజ్ ల నిర్మాణాల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మచిలీపట్నం నగరంలో డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కు సూచించారు. తొలిత పోర్టు సంబంధిత అధికారులు పోర్టు నిర్మాణ ప్రదేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. పోర్టు ప్రాజెక్ట్ మొత్తం 16 బెర్తుల నిర్మాణం చేపట్టవలసి ఉండగా, తొలి దశలో నాలుగు బెర్తులను పూర్తి చేసే క్రమంలో సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణం రెండు కిలోమీటర్లు, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణం 250 మీటర్లు, డ్రెడ్జింగ్, రోడ్డు రైలు మార్గం, కాంపౌండ్ వాల్, పోర్టు కార్యకలాపాల ప్రధాన భవనాల నిర్మాణాల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, బందరు ఆర్టీవో ఎం వాణి, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డిపిఓ నాగేశ్వరరావు నాయక్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి టి శివప్రసాద్, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాస్, రైట్స్ టీం లీడర్ విశ్వనాథం, ఆర్ అండ్ బి ఈఈ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ తేజేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *