Breaking News

ప్రజల రేపటి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం…

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల రేపటి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విన్నూత్న కార్యక్రమాలను శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర సముపార్జన కోసం సర్వస్వము త్యాగం చేసిన ఆనాటి అమరవీరుల త్యాగాల స్పూర్తితో నేటి యువత దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. పేదల ఆశలు నెరవేరడానికి తగు అవకాశాలు కల్పించే శీఘ్రతర, సమగ్ర ఆర్థికాభివృద్ధికి పటిష్టమైన విధానాలను అమలు చేస్తామన్నారు. తద్వారా సంపద సృష్టితో సంక్షేమ పధకాల విస్తృత అమలును పటిష్టం చేయనున్నామని మంత్రి చెప్పారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సూపర్ సిక్స్ కుక్ తోడుగా 2. 0 తో పేదల ఆదాయం పెంచి, వారి బ్రతుకులు మార్చే దిశగా ఎన్నికలలో ఇచ్చిన మానిఫెస్టో ని అమలు చేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. సాగునీటి రంగం, రైతాంగ సంక్షేమం మా తోలి ప్రాధాన్యత అని, తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులన్నీ అధికమించి ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అంకితం ఇచ్చేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. నదుల అనుసంధానానికి దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని మళ్ళీ పట్టాలెక్కించామన్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజనులో కృష్ణా డెల్టాలోని లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టు స్థిరీకరణకు సాగునీరు అందించామన్నారు. జిల్లాను అన్ని రంగాలలో ముందు స్థానంలో ఉంచేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలలో నిర్దేశించిన లక్షయాలను 100 రోజులలో సాధించే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు 2 వేల 284 కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించామని, 12 వేల 205 మంది కౌలు రైతులకు 82 కోట్ల రూపాయలను పంట రుణాలుగా అందించామన్నారు. జిల్లాలో మరింత మంది కౌలు రైతులను గుర్తించి, వారికి సాగుదారుల హక్కు పత్రాలను అందించి, మరింతగా పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సూక్ష సేద్య పధకంలో 15 వేల హెక్టార్లలో బిందు మరియు తుంపర సేద్యమునకు 98 కోట్ల రూపాయలు సబ్సిడీతో స్ప్రింక్లర్లు అందింస్తున్నామన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 2 లక్షల 66 వేల 867 మందికి ప్రతీ నెలా 114 కోట్ల రూపాయలను పెన్షన్లుగా అందిస్తున్నామని పెన్షన్ మొత్తాన్ని 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచామన్నారు. ఏటా 408 కోట్ల రూపాయలను పెంచిన పెన్షన్ రూపంలో అదనంగా చెల్లిస్తున్నామన్నారు. పేదవారి స్వంత ఇంటి కలను సాకారం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని, ఇప్పటివరకు ఇల్లు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వాని నుండి పక్కా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. గతంలో టిడ్కో గృహాలు మంజూరై, నిర్మాణ పనులు పూర్తి కానీ ఇళ్ల నిర్మాణ పనులను 2025, మార్చ్ నాటికి పూర్తి చేస్తామని, 2014 తరవాత ఇల్లు మంజూరై బిల్లులు చెల్లింపులు జరగని ఇళ్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ సమయంలో నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి పరిశ్రమానికవాడను అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇసుక అధిక రేట్లతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని, దీంతో నిర్మాణ రంగం కుదేలైపోయిందన్నారు. నిర్మాణ రంగాన్ని గాడిలోపెట్టి, కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా సామాన్యులకు ఉచితంగా ఇసుకను అందిస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలోని 29 వేల 156 స్వయం సహాయక సంఘాలకు 1828 కోట్ల రూపాయలను రుణాలుగా అందిస్తున్నామన్నారు. మహిళలలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. జిల్లాలో అన్నా క్యాంటిన్లు పునఃప్రారంబించి పేదలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల సమస్యలకు సత్వరంగా పరిష్కారం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో రబీలో 441 కోట్ల విలువైన 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుండి సేకరించగా, గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 200 కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను తెలియజేసి, వాటి వినియోగాన్ని అరికట్టడానికి “నషా ముక్త భారత్ అభియాన్” కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగంపై ఫిర్యాదులు నమోదు, డి-అడిక్షన్ కేంద్రాల సేవల నిమిత్తం టోల్ ఫి నెంబర్ 14446 ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ పేద కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య భీమా వర్తింపజేసి, ప్రతీ పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వైల్డ్ లైఫ్, అడ్వెంచర్, హెరిటేజ్, ఎకో,టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుచేసి ఉపాధికల్పనకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద 5. 20 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయకక్షలు ప్రేరేపించకుండా గ్రామాలలో, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా ప్రవర్తించాలని అందరికీ ముఖ్యమంత్రి సూచించారని మంత్రి చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, న్యాయమూర్తులు బుల్లి కృష్ణ, ఎస్.కె.ఎండి . ఏ . పర్వీజ్ , జిల్లా న్యాయసేవాధికార సమస్త కార్యదర్శి కె. రత్నప్రసాద్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ , జాయింట్ కలెక్టర్ పి .ధాత్రిరెడ్డి, డిఆర్ఓ డి.పుష్పమణి, , ఆర్డీఓ ఎన్ .ఎస్. కె. ఖాజావలి , డి.ఆర్.డి. ఏ పీడీ విజయరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *