Breaking News

శ్రీసిటీ లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

-ఈ నెల 19న శ్రీసిటీ నందు పలు పరిశ్రమలకు ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్ల సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

రేణిగుంట, శ్రీసిటీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19 న శ్రీసిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా కలెక్టర్ ఎస్పీ సుబ్బరాయుడు తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ముందస్తు భద్రత సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. 8 పరిశ్రమలకు భూమి పూజ, 16 పరిశ్రమల ప్రారంభానికి, 5 పరిశ్రమలకు ఎంఓయు లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారని తెలుపుతూ కలెక్టర్ అధికారులకు ఈ సందర్భంగా సూచిస్తూ హెలిప్యాడ్ ఏర్పాట్లు, అక్కడ షేడ్, భద్రత ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని సూచించారు. శ్రీ సిటీ సమీపం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన శ్రీసిటీ లోని బిజినెస్ సెంటర్ కు చేరుకుని భూమి పూజ, ప్రారంభోత్సవాలు పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఫాక్స్ కాన్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైతారని తెలిపారు. అనంతరం పలువురు పరిశ్రమల సిఈఓ లతో సమావేశంలో పాల్గొంటారని అన్నారు. కాన్ఫరెన్స్ హాల్ నందు, భూమి పూజ, పరిశ్రమలను ప్రారంభించనున్న ప్రాంతంలో మైక్ ఏర్పాట్లు, పవర్, అధునాతన అంబులెన్స్ ఏర్పాటు, భద్రత తదితర ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.

ఎస్పీ మాట్లాడుతూ భద్రతా పరమైన అంశాలలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ శ్రీ సిటీలో జరుగుతున్న పలు ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి లు కులశేఖర్, విమల కుమారి, ఆర్డీఓ కిరణ్ కుమార్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి చంద్ర శేఖర్, జిల్లా ఇంఛార్జి పరిశ్రమల శాఖ అధికారి, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఆర్ అండ్ బి ఎస్ ఈ మధుసూధన్ రావు, శ్రీసిటీ ప్రతినిధులు పీ. ముకుంద రెడ్డి రెసిడెంట్ డైరెక్టర్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *