Breaking News

రాష్ట్ర మంత్రిమండ‌లి స‌మావేశం నిర్ణయాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో బుధవారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి ఈ-కేబినెట్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ..

2014-2019 మధ్య కాలంలో నిర్వహించిన కాగిత రహిత (పేపర్‌లెస్) కేబినెట్ తరహా మరొక అధునాతన అప్లికేషన్ వినియోగించి నేడు మొదటి ఈ – కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం.

ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బహుళ ఫీచర్లతో కూడిన సమగ్ర అప్లికేషన్ ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నేడు ఈ- కేబినెట్ నిర్వహించింది.

ఈ-కేబినెట్ విధానంలో మంత్రివర్గ ఎజెండా, కేబినెట్ నోట్స్ ఇలా అన్నీ ఆన్ లైన్ లోనే అందుబాటులో ఉంటాయి. పేపర్‌లెస్ కాన్సెప్ట్‌తో ఈ-కేబినెట్ నిర్వహణ అంటే కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాస్తవికతకు అద్దం పడుతుంది. తద్వారా పర్యవేక్షణ సామర్ధ్యం పెరుగడంతో పాటు పర్యావరణానికి అనుకూలమైన విధానం.

కేబినెట్ నిర్ణయాల అమలు తీరును మంత్రులు సమర్థంగా పర్యవేక్షించే వీలు కలుగుతుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా సంబంధిత సమాచారం ఆన్ లైన్ లో యాక్సెస్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. సమాచారం గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది.

కేబినెట్ నిర్ణయాల అమలు స్థితిని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పర్యవేక్షించడం, అంచనా వేసేందుకు అనుకూలంగా ఉంటుంది.

సమగ్ర డేటా విశ్లేషణ, రిపోర్టింగ్ సామర్థ్యం, అనధికార యాక్సెస్ ను నిరోధించి సమాచారాన్ని భద్రపరిచేందుకు అవకాశం ఉంది.

వర్చువల్ కేబినెట్ సమావేశాన్ని ఈ – ఆఫీస్ తో అనుసంధానం చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం వంటి అదనపు లక్షణాలను కలిగి ఉంది.

రాష్ట్రంలో జనావాస ప్రాంతాల్లో 14,000 సీసీ కెమెరాలు ఉన్నాయని, అలాగే ప్రైవేట్ యాజమాన్యంలో, ప్రైవేట్ స్థలాలు మరియ భవనాల దగ్గరున్న సీసీ టీవీలు అనుసంధానం చేయడం ద్వాారా శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తుంది. కనుక దీనిపై ఒక ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని కేబినెట్ కు ముఖ్యమంత్రి సూచించారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ కు సాంకేతికతను జోడిస్తూ ఇన్సిడెంట్ మానిటరింగ్ సిస్టమ్, అలర్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా రాష్ట్రంలో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి తగు చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని అన్నారు.

డ్రోన్ల వినియోగం ద్వాారా కూడా రోడ్లపై గుంతలు గుర్తించడం, దోమల నియంత్రణ, అంటువ్యాధులు అరికట్టడం, తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో మందుల పిచికారీ చేసేందుకు దోహదపడుతుందన్నారు.

కేబినెట్ నిర్ణయాలు :

1. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్ మెంట్ :

07-03-2024న G.O. MS.No.41 ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని మెరిట్ జాబితాలో మిగిలిపోయిన ఆసక్తిగల, అర్హులైన బి.కాం అభ్యర్థులను గ్రేడ్-2 కేటగిరిలో వార్డ్ వెల్ఫేర్ & డెవలప్ మెంట్ సెక్రటరీలుగా నియమించేందుకు 269 సూపర్ న్యూమరీ పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం..

స్టేట్‌మెంట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం జిల్లా వారీగా మరియు రాష్ట్ర ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఈ సిబ్బందిని చేర్చుకునే వరకు, కోర్టు ధిక్కార పరిధిలోకి రాకుండా మరియు ఆర్థిక శాఖ అంగీకారం మేరకు సాంఘిక సంక్షేమ శాఖలోని సంక్షేమ మరియు విద్యా సహాయకుల పోస్టులను ఖాళీగా ఉంచాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

2. సాగునీటి రైతు సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం :

ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్ మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ యాక్ట్ – 2018 సెక్షన్ 4 ప్రకారం సాగునీటి రైతు సంఘాల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.

మేజర్ ప్రాజెక్టుల్లో భాగంగా తోట వెంకటాచలం పుష్కర లిప్ట్ ఇరిగేషన్ సిస్టమ్ పరిధిలో సాగయ్యే 89,449 ఎకరాలు, మీడియం ప్రాజెక్టుల క్రింద మడ్డువలసలో సాగు అయ్యే 24,877 ఎకరాలు, సూరంపాలెం మీడియం ప్రాజెక్టు క్రింద 11,931 ఎకరాలు మొత్తంగా 1,26,257 ఎకరాల ఆయకట్టు పరిధిని స్థిరీకరించడం, సంబంధిత ప్రాంత ఓటర్ లిస్ట్ జాబితాను నవీకరించి 90 రోజుల్లోగా సాగునీటి రైతు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్ మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ యూజర్స్ అసోసియేషన్ నిబంధనలు – 2003 (జీవో ఎం.ఎస్ నంబర్ 20, I&CAD, తేది: 20.02.2003) లోని రూల్ 12 (5) ను తొలగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.

3.రివర్స్ టెండర్ విధానం రద్దు చేసిన కేబినెట్. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం:

2019లో లోపభూయిష్టంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండర్ విధానానికి స్వస్తి పలుకుతూ రద్దు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నూతన టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేబినెట్ కు సూచించారు.

G.O.MS నంబర్ 67, వాటర్ రిసోర్స్ (రిఫార్మ్స్) తేదీ: 16.08.2019 ప్రకారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలోని పనులను పిలువడం, ఖరారు చేయడం మరియు అప్పగించడం వంటి వాటిలో రివర్స్ టెండరింగ్‌కు బదులుగా సాంప్రదాయ టెండర్ ప్రక్రియను అమలు చేయడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

* 4.పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం. ప్రస్తుత పనులు చేపడుతోన్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించేందుకు కెేబినెట్ అంగీకారం:

ప్రస్తుతమున్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ల రేట్లు, ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6000 క్యూసెక్కుల సామర్థ్యమున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారుచేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎడమ కాలువ పనులకు సంబంధించిన ప్రీ-క్లోజ్డ్ ప్యాకేజీలలో మిగిలిన బ్యాలెన్స్ పనుల నుండి అవసరమైన / క్లిష్టమైన పనులను రూ. 1226.68 కోట్ల అంచనా వ్యయంతో SoR 2024-25 లో ఎల్ఎస్ విధానంలో టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వర్షాలు బాగా కురుస్తున్నందున ప్రస్తుత సీజన్ లో అన్ని రిజర్వాయర్లు, చెరువులు నిండే విధంగా ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖకు ముఖ్యమంత్రి నిర్దేశించారు.

విశాఖపట్నం ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందించేందుకు అవకాశం కలుగుతుంది. విశాఖపట్టణానికి మొదట లిప్ట్ విధానంలో నీరు అందిస్తాం.. పోలవరం పూర్తైన తర్వాత గ్రావిటీ ద్వారా పూర్తిస్థాయిలో నీరు అందిస్తాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయాయి. తుంగభద్ర గేటు కొట్టుకుపోయింది.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమయస్ఫూర్తితో కర్ణాటక ప్రభుత్వం సమన్వయంతో 3 రోజుల్లోనే సమస్యను పరిష్కరించాం.ఇందుకుగాను సీఎం చొరవకు కేబినెట్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలించి అవసరమైన మేరకు మరమ్మత్తులు చేపడతాం.

5.హోం:

తేదీ 16.08.2021న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు G.O.Ms.No.91, హోం (పెరోల్స్ & హెచ్‌ఆర్‌సి) డిపార్ట్‌మెంట్ ఉత్తర్వుల ప్రకారం అనంతపురంలోని వ్యవసాయ కాలనీలోని జైళ్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ నెం.4461, కొండూరు రామ చంద్రారెడ్డి S/o కృష్ణా రెడ్డి, 73 ఏళ్లు, ముందస్తు విడుదలకు ప్రత్యేక రిమిషన్ మంజూరు కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తద్వారా బాహ్య ప్రపంచానికి, జైల్లో గడిపిన రోజులకు మధ్య అంతరం తెలుసుకొని సమాజంలో కలిసి పోయే తత్వం పెరుగుతుందన్న భావన..

6.ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో రద్దుకు తీర్మానం:

2019 కి ముందు ఎగ్జిక్యూటివ్, ఎన్ ఫోర్స్ మెంట్, డిస్టిలరీ వింగ్ లు ఒకే లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఉంటూ సమర్థవంతంగా పనిచేసేవి. 2020 మే లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటుతో ఎక్సైజ్ సిబ్బందికి, సెబ్ కి మధ్య సమన్వయలోపం ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం నియంత్రణ, నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం మొదలైన నేరాల నియంత్రణపై పట్టు కోల్పోవడంతో 2019 – 24 మధ్య కాలంలో ఎన్డీపీఎల్ నేరాల సంఖ్య 66 శాతానికి పెరిగింది.

కేరళ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించిన అధ్యయన బృందం ఆయా రాష్ట్రాల్లో ఒకే లైఫ్ లైన్ తో పనిచేస్తున్న ఎక్సైజ్ శాఖ తీరును పరిశీలించి బాగుందని తెలిపింది. ఈ నేపథ్యంలో సెబ్ లోని సిబ్బందిని ఎక్సైజ్ శాఖలో ఉంచాలని ప్రతిపాదన చేసింది. గత ప్రభుత్వం “సెబ్” ను ఆదాయం పెంచుకునేందుకు వినియోగించలేదు.
గత ఎక్సైజ్ విధానం వల్ల రాష్ట్రానికి రూ.18,860 కోట్లు నష్టం వాటిల్లిందని, సరియైన నియంత్రణ లేని కారణంగా రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లిందని, అలాగే ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ ఈ నేపథ్యంలో నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకురావాలని మంత్రివర్గానికి సీఎం సూచించారు.

7. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు కేబినెట్ ఆమోదం. 21.86 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 77 లక్షల సర్వే రాళ్ళ పై మాజీ సీఎం జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకునేందుకు కేబినెట్ ఆమోదం. 22 ఏ, ఫ్రీ హోల్డ్ భూములు వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కేబినెట్ ఆమోదం.. వివాదాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.

ప్రస్తుతం ఫైళ్ల దగ్ధం ఘటనలను కూడా దృష్టిలో ఉంచుకొని 29 లక్షల ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ పై విచారణ చేపట్టాం. వీటిలో 16.66 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు విచారణలో తేలింది. అలాగే ఫ్రీహోల్డ్ లో ఉన్న 25,230 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో అన్యాక్రాంతమైన భూములపై గ్రామ సభల్లో చర్చిస్తాం. అవి ఎలా అన్యాక్రాంతమయ్యాయో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్ లో భూముల రికార్డులు తారుమారుకాకుండా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేబినెట్ కు సూచించారు.

8. కొత్తగా 2,774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం..కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ -పోస్ మిషన్ ల కొనుగోలుకు రూ. 11.51 నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం.

9.సాధారణ పరిపాలన శాఖ (రాటిఫికేషన్):

పీఏల జీతం 18,000 నుండి 36,000 కు, పీఎస్ ల జీతం 50,000లకు పెంచాలని చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం

10. సాధారణ పరిపాలన శాఖ (ఉద్యోగాల సృష్టి):

ప్రతి మంత్రికి నలుగురు చొప్పున (ఒక పీఆర్వో, ఒక విజన్ మెయింటెనెన్స్ అధికారి, సోషల్ మీడియా మేనేజర్స్ ఇద్దరు) మొత్తం 96 పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం. 3 వారాల్లో సంబంధిత నియామకాలను భర్తీ చేయాలని ఆదేశం..

11. ఇండస్ట్రీ అండ్ కామర్స్ :

కృష్ణపట్నం ఇండ్రస్ట్రియల్ సిటీ డెవలప్ మెంట్ లిమిటెడ్ (NICDIT) పేరును ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP – ICIDCL) గా, ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్ లకు కూడా పేర్లు మార్చాలని నిర్ణయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

12.ఇండస్ట్రీ అండ్ కామర్స్ ( శాండ్ పాలసీ):

ఇసుక పాలసీని పునరుద్ధరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. సులభతర, సమర్థవంతమైన విధానానికి చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. డిజిటల్ విధానం ద్వారా ఇసుక బుకింగ్, ఇసుక లభ్యతను మెరుగుపరచడం, వినియోగదారులకు రవాణాను సులభతరం చేయడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం వంటి ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇసుకకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.

13.వికసిత్ ఆంధ్ర @ 2047:

విజన్ డాక్యుమెంట్ రూపకల్పన లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులను చేయాలని, వారి సలహాలు, సూచనలు ప్రతిబింబించే విధంగా, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేయాలని కేబినెట్ కు ముఖ్యమంత్రి సూచించారు. దీని కోసం గ్రామ సభలు నిర్వహించి ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, ఆలోచనలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కేబినెట్ ను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *