గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరం నుండి మురుగు సముద్రంలోకి వెళ్లే పీకల వాగు మెయిన్ డ్రైన్ వేజెండ్ల, సుద్దపల్లి పంట పొలాల్లోకి పొంగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం కమిషనర్ వేజెండ్ల, సుద్దపల్లి గ్రామాల పరిధిలో పీకల వాగు, సంగంజాగర్లమూడి నుండి గుంటూరు నగరానికి త్రాగునీటి సరఫరా జరిగే పైప్ లైన్ ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వేజెండ్ల, సుద్దపల్లి గ్రామాల రైతులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ, సుధీర్ఘకాలం నుండి గ్రామాల ప్రజలు పీకలవాగు పొంగడం వలన పంట పొలాలు మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇటీవల తమ దృష్టికి తీసుకొచ్చారని, సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలన కోసం వచ్చామని తెలిపారు. సంగం జాగర్లమూడి నుండి వచ్చే త్రాగునీటి పైప్ లైన్ 3 ప్రాంతాల్లో పీకలవాగుని క్రాస్ చేస్తుందని, ఆయా ప్రాంతాల్లో కల్వర్ట్ ల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నగరం నుండి వచ్చే మురుగు పీకలవాగు ద్వారానే వెళ్తుందని, వాగు అనేక ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైందని స్థానిక రైతుల ఫిర్యాదు మేరకు వాగుని సమగ్ర సర్వే చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే త్రాగునీటి పైప్ లైన్ పై ఏర్పడిన లీకులను తక్షణం మరమత్తు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఏసిపి చంద్రశేఖర్, టిపిఎస్ లక్ష్మణస్వామి, సర్వేయర్ సుభాని, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణరెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News