మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని హౌసింగ్ అధికారులు సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం వేగం పెంచాలన్నారు. వివిధ నిర్మాణాల దశల్లో స్టేజ్ కన్వర్షన్ పురోగతి సాధించాలన్నారు. వారం వారం సమీక్షిస్తున్నప్పటికీ ఉయ్యూరు, ఘంటసాల, పెడన వంటి మండలాల్లో పెద్దగా పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చెల్లింపులపై దృష్టి పెట్టాలన్నారు తాడిగడప, గుడివాడ మున్సిపల్ పరిధిలో ఫోకస్ పెట్టాలని కమిషనర్లను ఆదేశించారు. మచిలీపట్నం మున్సిపల్ పరిధి రూరల్ మండలాల్లో పురోగతి సాధిస్తే జిల్లా వ్యాప్తంగా ప్రగతి ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఈ దిశగా కృషి చేయాలన్నారు. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ ఏఈ, డి ఈ ల సమన్వయంతో గృహ నిర్మాణ ప్రగతిలో నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్లో జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి ఎస్ వెంకట్రావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News