– ఖజానా కార్యాలయాల్లో అందుబాటులో ప్రత్యేక కౌంటర్లు
– ఎన్టీఆర్ జిల్లా ఖజానా, అకౌంట్స్ అధికారి ఎ.రవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, కుటుంబ పింఛనుదారులు తమ వార్షిక జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని (లైఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్) జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా సమర్పించాలని ఎన్టీఆర్ జిల్లా ఖజానా, అకౌంట్స్ అధికారి ఎ.రవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ వార్షిక జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా లేదా పెన్షనర్ల వ్యక్తిగత సీఎంఎఫ్ఎస్ లాగిన్ ద్వారా లేదా ఏదైనా ఖజానా కార్యాలయంలో సమర్పించాలన్నారు. పెన్షనర్ల ఆధార్ నంబరు, మొబైల్ నంబరు (ఓటీపీ కోసం), పీపీవో నంబరు, బ్యాంకు ఖాతా నంబరులను సరిచూసుకోవాలన్నారు. ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకుంటే ఏప్రిల్ 1వ తేదీన ఇచ్చే మార్చి నెల పింఛను నిలిపేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని పెన్షనర్లు గుర్తించాలన్నారు. జిల్లా పరిధిలో విజయవాడ తూర్పులోని డివిజనల్ ఖజానా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. అదేవిధంగా నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట ఖజానా కార్యాలయాల్లోనూ ఫించనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చన్నారు. ఏవైనా సందేహాలు, ఇబ్బందులు ఉంటే సంబంధిత ఖజానా కార్యాలయ అధికారులను సంప్రదించి, పరిష్కరించుకోవాలని ఖజానా అధికారి ఎ.రవి సూచించారు.
Prajavartha Online Telugu News